కొండా సురేఖ బర్తరఫ్తో రాష్ట్ర కాంగ్రెస్ లో మంత్రి పదవుల సందడి మొదలైంది. సిఫారసులు, పైరవీలు, పెద్దలను కలవటాలు షురూ అయ్యాయి. దీంతో గాంధీ భవన్లో విపరీతమైన రద్దీ నెలకొంది. క్యాబినెట్లో బెర్తును ఆశించేవారు సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. శనివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు గాంధీ భవన్కు వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ను, మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసేందుకు ఆశావహులు శాయశక్తులా ప్రయ్నతించారు. ఈ విషయాన్ని గమనించిన పాత్రికేయులు… అన్నా.. మహేశన్నా… ఇంతకీ ఎవరెవరికి మంత్రి పదవులు ఇప్పిస్తున్నావన్నా.. అని అడగ్గా… ఆయన ఓ నవ్వు నవ్వి… మనదేముంటుంది… అంతా పైవాళ్లు (అధిష్టానం, సీఎం) చూసుకుంటారు. ఎవరి రాతలైనా రాసేది వాళ్లే… అని వ్యాఖ్యానించారు. ఇంతలో ఓ సీనియర్ జర్నలిస్టు అందుకుని అందరి తలరాతలు రాసేది ఆ ఈశ్వరుడే కదన్నా…అందుకే కాంగ్రెస్ నేతలకు మీరే ఈశ్వరుడు, ఎందుకంటే మీ పేరులోనే మహేశ్వరుడున్నాడు కదా..? అని కామెంట్ చేశారు… దీంతో అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. పక్కనే ఉన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ… ఆయనది తలరాతలు రాసే పనైతే.. మాది మంట పెట్టే (ప్రభాకరుడు అంటే సూర్యుడు) పని.. అనటంతో ఆ హాల్లో ఉన్నవారందరూ ఘొల్లుమన్నారు.. మహేశ్ కుమార్ గౌడ్ తో సహా…
బి.వి.యన్.పద్మరాజు
ఈశ్వరా.. మహేశ్వరా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


