వారితో ముప్పున్న వారికీ భద్రత తొలగింపు
దేశంలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గడమే కారణం
కసరత్తు చేస్తున్న రాష్ట్ర హోంశాఖ
ప్యారక వాసుదేవాచారి
మావోయిస్టుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో భారీ కోత విధించాలని హోంశాఖ కసరత్తు చేస్తోంది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్టు ఇటీవలనే రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల అణచివేతకు ప్రభుత్వం వినియో గించే కోట్ల రూపాయల నిధుల అంశం చర్చకు వస్తున్నది. అలాగే ఇప్పటి వరకు మావోయిస్టుల బెదిరింపులతో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నదని ప్రభుత్వాన్ని ఆశ్రయించి, సాయుధ రక్షణ పొందుతున్న పలువురి నుంచి అంగరక్షకులను ఉపసంహరించుకోవాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు 40 ఏండ్లుగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలు సాగిన విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు మావోయిస్టుల కార్యకలాపాల అణచివేత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రం ‘కగార్’ పేరుతో దండకారణ్యాన్ని వేలాది మంది సాయుధ పోలీసు బలగాలతో చుట్టుముట్టి గాలింపు చర్యలను చేపట్టి, మావోయిస్టుల ఏరివేతను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపార్టీలోని నాయక శ్రేణి మొదలు క్యాడర్ వరకు భారీ సంఖ్యలో దెబ్బతిన్నారు. ఎన్కౌంటర్లలో వేలాదిమంది చనిపోయారు. మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డెడ్లైన్లుపెట్టి, కూంబింగ్ ఆపరేషన్లను పెంచాయి. మావోయిస్టుల లొంగుబాటుకు ఈ ఏడాది మార్చి 31 వరకు గడువును విధించారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవోజీ అలియాస్ టిప్పిరి తిరుపతి మొదలుకొని పలువురు కేంద్ర కమిటీ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, వివిధ స్థాయిల్లోని మావోయిస్టులు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఇటీవల 42 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోగా, ఇక రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్టేనని డీజీపీ ప్రకటించారు. మావోయిస్టు మాజీ కార్యదర్శి గణపతితో పాటు మరో ఐదుగురు మాత్రమే ఉన్నారనీ, వారు లొంగిపోతే దేశంలో మావోయిస్టు కార్యకలాపాలకు పూర్తిగా తెర పడినట్టేనని డీజీపీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్రం ఎదుర్కొన్న మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయినట్టు పోలీస్ శాఖ నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఈ కార్యకలాపాల కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల నిధులను కూడా నిలిపివేయాలని రాష్ట్ర హోంశాఖ యోచిస్తున్నట్టు తెలిసింది.
మావోయిస్టుల ఆచూకీ కనిపెట్టేందుకు ఇచ్చే ఎస్ఆర్ నగదుపైనా కోతకు సమాయత్తం
మరీ ముఖ్యంగా మావోయిస్టుల ఆచూకీని కనిపెట్టడానికి ఇటు పోలీసులు, అటు రహస్య వేగులకు ఇచ్చే లక్షల రూపాయల సీక్రెట్ రిజర్వ్ అమౌంట్ (ఎస్ఆర్ అమౌంట్ )నిధులపై కూడా భారీ కోత విధించడానికి హోంశాఖ సమాయత్తం అవుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హెచ్.జె.దొర డీజీపీగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఏటా దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు మావోయిస్టుల సమాచారం కోసం నిధులను విరివిగా ఖర్చు పెట్టేవారని మాజీ పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ నిధుల్లో కొంత కోత విధించింది. తాజా మార్పుల నేపథ్యంలో మావోయిస్టుల సమస్య రాష్ట్రానికి పూర్తిగా తొలగిపోయినట్టేనని రూఢ అయ్యేంత వరకు కొంత ఎస్ఆర్ అమౌంట్ నిధులను విడుదల చేసి, మిగితా శాతాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. దీని వలన ప్రభుత్వ ఖజానాకు కొంత వ్యయం తగ్గుతుందని సర్కారు భావిస్తోంది. కాగా ఈ ఎస్ఆర్ అమౌంట్ వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆడిట్ ఉండదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
ముప్పున్న వారికి అంగరక్షకుల కొనసాగింపుపై యోచన
మరోవైపు గత 40 ఏండ్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల నుంచి ముప్పున్న వారికి, ఆ తీవ్రతను బట్టి అంగరక్షకులను (గన్మెన్స్) కేటాయించేవారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు మొదలుకొని హైదరాబాద్లో ఉన్న వారి వరకు వారికున్న ముప్పును బట్టి జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ క్యాటగిరీల్లో ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగం రక్షితులకు గన్మెన్లను కేటాయింస్తూ వస్తున్నారు. వీరికిచ్చే సెక్యూరిటీని ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పోలీసు ఉన్నతాధికారులతో కూడిన సెక్యూరిటీ రివిజన్ కమిటీ పరిశీలన జరిపి అవసరమైన వారికి పొడిగించడం, ముప్పు లేని వారికి అంగరక్షకులను తగ్గించడం జరుగుతున్నది. ఇందు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. తాజాగా మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ముప్పున్న వారికి అంగరక్షకులను కొనసాగించడం ఎంతవరకు సబబు అని హోంశాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. దీనికయ్యే వ్యయం కూడా ఎక్కువ కావడంతో వీరి సంఖ్యను తగ్గించడమో లేక పరిస్థితులను పరిశీలించి అంగరక్షకులను పూర్తిగా తొలగించడమే చేయడానికి హోంశాఖ అధికారులు తీవ్రంగా యోచిస్తున్నారని సమాచారం. దీనివల్ల అంగరక్షకులు వెనక్కి రావడంతో పోలీస్శాఖలోని సిబ్బంది కొరత కూడా తగ్గుతుందని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే మావోయిస్టుల కార్యకలాపాలు దేశంలో పూర్తిగా తగ్గిపోయినట్టు కచ్చితమైన వార్తలు అందే వరకు వారితో ముప్పున్న రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు, మరి కొందరికి అంగరక్షకులను కొనసాగించడం మంచిదని మరి కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మావోయిస్టుల అణచివేత కార్యకలాపాల కోసం 40 ఏండ్ల క్రితం ప్రారంభించిన గ్రేహౌండ్స్ విభాగాన్ని, నక్సలైట్ల సమాచార సేకరణ కోసం ఏర్పడిన ఎస్ఐబీ విభాగాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాల అణచివేతతో పాటు సంఘ విద్రోహ శక్తులపై అవసరమైతే రంగంలోకి దించడానికి ఈ విభాగాల సేవలను ఉపయోగించనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయానికి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మావోయిస్టు నిధుల్లో కోత!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



