నవతెలంగాణ-హైదరాబాద్: వైవాహిక అత్యాచారానికి మినహాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణ తేదీని కేంద్ర ప్రభుత్వ వాదన విన్న అనంతరం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ కేసులను నవంబర్కు వాయిదా వేయాలన్న సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది జైసింగ్ ఈ పిటిషన్లను ప్రస్తావించారు. కేంద్రం ఇప్పటివరకు ఈ అంశంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయలేదని, పిటిషన్ల ప్రతులను కూడా సంబంధిత న్యాయవాదులు పరస్పరం పూర్తిగా మార్చుకోలేదని ఆమె పేర్కొన్నారు. అందువల్ల తుది విచారణను నవంబర్కు వాయిదా వేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం.. కేసును సెప్టెంబర్ 9న విచారించి కేంద్రం వాదనను వింటామని తెలిపింది. అనంతరం తుది విచారణకు తగిన తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారానికి సంబంధించిన పలు పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణకు ఉన్నాయి.
కేంద్రం స్పందన తర్వాత తుది విచారణ: సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



