అధికార పక్షానికో న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా..?
నవతెలంగాణ – రాయపోల్
బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రాయపోల్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామున అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ను ముట్టడిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయకుండా, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకుల ముట్టడి ప్రయత్నాన్ని అడ్డుకోకుండా బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు.చట్టం అందరికీ సమానంగా వర్తించాలి అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఉండకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కులను కాలరాయడం సరికాదన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్, రాజిరెడ్డి, రంగారెడ్డి, వెంకటరామిరెడ్డి , రాజయ్య, ఇస్తారి, భార్గవ్, మురళి గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.



