నవతెలంగాణ-హైదారాబాద్: జీవన్ రెడ్డి నిఖార్సైనా నిజాయితీ గల మనిషి, తనతో 45ఏండ్ల స్నేహం ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ మారడం అభినందనీయమని కేసీఆర్ అన్నారు. కరీంనగర్ కోసం అహర్నశలు శ్రమించారని, అందుకే అనేక పర్యాయలు ప్రజలు గెలిపించారని ప్రశంసించారు. జగిత్యాల ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గాల ప్రజల కోసం అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు. అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. కుటుంబంలో అన్నదమ్ముల లాగా పని చేద్దామని జీవన్ రెడ్డితో చర్చించానని తెలియజేశారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాందని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి తన అమూల్యమైన సేవలు అందిస్తారని, అందుకు జగిత్యాల ప్రజలు సంపూర్ణ మద్దతుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రస్తుతం భయంకర పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు భాష, సంస్కృతి, తెలంగాణ పదంపై నిషేధం విధించారు. రైతాంగం చిన్నాభిన్నమైంది, ఉపాధి లేక భారీ యోత్తున యువత వలసలు వెళ్లిపోయిందని గుర్తు చేశారు. కరెంట్ చార్జీలు పెంచి చంద్రబాబు అన్నదాతల నడ్డివిరిచారని, ప్రశ్నించినందుకు బషీర్బాగ్లో కాల్పులతో రైతులపై తెగబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో భూములు కబ్జాకు గురియ్యాయి. ఉద్యమ సమయంలో అనేక అవమానాలకు తనను గురి చేశారని, అయినా కూడా ఆత్మ విశ్వాసంతో, ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను సాధించుకున్నామన్నారు.
ఆ తర్వాత పదేండ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులతో తెలంగాణను అభివృద్ధి చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి ఉన్నా..తెలంగాణ అభివృద్ధి నశించిందని కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని ప్రశ్నించినందుకు కేసీఆర్ చావాలని శాపనార్థాలు పెడుతున్నారని, ఎన్ని శాపాలు పెట్టనా వెయ్యి జన్మల చావానని స్పష్టం చేశారు. బొమ్మరిల్లుగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు.
24గంటల విద్యుత్తు సరఫరా అందజేశామని, కానీ దరిద్రుల పాలనలో రైతులు, ప్రజలు అరిగోసలు పడుతున్నారని మండిపడ్డారు. అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయిన వార్తలు పేపర్లో, టీవీల్లో చూశామన్నారు. ప్రస్తుతం అనేక పథకాలకు ఎగనామం పెట్టరని విమర్శించారు. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని మాట మార్చారని, ఫించనులు పెంచుతామని మోసపూరిత హామీలతో ప్రజలను వంచించారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందించకుండా అన్నదాతలను ఏడిపించారని, పోలీసుల స్టేషన్ ఆధీనంలో ఎరువులు అమ్మారని, ఈ అసమర్ధ ప్రభుత్వ పాలనలో అన్ని కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. జగిత్యాలో సభ అనగానే రైతు భరోసా ఇస్తామని ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ఆర్థిక ఆదాయం ప్రస్తుతం దిగజారిపోయింది. రాష్ట్రంలో రియల్ ఎస్ట్రేట్ దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా భారీగా నష్టపోయిందన్నారు. పండించిన పంటలను కొనకుండా, బొనస్ పేరుతో రైతులను మోసగించారని వాపోయారు. ఉద్యోగులను మోసగించారు, ఆటో కార్మికుల ఉపాధిని కొల్లగొట్టారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తివేస్తామని కేసీఆర్ చెప్పారు.



