– బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖలకు ఉన్నతాధికారులు కరువు
– ఒక్కరిపైనే భారం
– వెల్ఫేర్ వీక్ ఎలా సాధ్యం…?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘వెల్ఫేర్ వీక్…’ నామ్కే వాస్తేగా తయారైంది. ఆ కార్యక్రమంలో వేసుకున్న ప్రణాళికలు, రూపొందించిన విధి విధానాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సీఎస్ రామకృష్ణారావు ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, వికలాంగులు, వయో వృద్ధులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెల్ఫేర్ వీక్లో భాగంగా ఆయా తరగతులకు చెందిన వారికి పింఛన్లు, ఆర్థిక సాయాలు, పరికరాలు, ట్రై సైకిళ్ల లాంటివి అందుతున్నాయో? లేదో తెలుసుకోవాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఒక సమగ్ర నివేదికను రూపొందించి, సమర్పించాలని సూచిం చారు. కానీ ఆయన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమల వుతున్న దాఖలాలు కనిపించటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు సంబంధించి కీలకమైన ముఖ్య కార్య దర్శుల పోస్టులు ఖాళీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాలను కింది స్థాయికి పంపి, జిల్లా అధికారులను అప్రమత్తం చేసేవారు లేక పోవటంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల్లోని ముఖ్య కార్యదర్శులను ప్రభుత్వం కొన్ని నెలల క్రితం బదిలీ చేసింది. ఆయా పోస్టులను భర్తీ చేయకుండా మూడింటికీ కలిపి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సభ్యసాచి ఘోష్ను నియమించారు. కానీ మూడు కీలక శాఖలను ఒక్కరే చూడాల్సి రావటంతో అది ఆయనకు భారం గా మారినట్టు సమాచారం. ఈ మూడు శాఖల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, వివిధ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల, వాటికి సంబంధించి ప్రవేశాలు, నోటిఫికేషన్లు, ఫీజు రీయిం బర్స్మెంట్, స్కాలర్షిప్పులు, లిడ్క్యాప్, ట్రైకార్ సంస్థ, పోడు భూములకు పట్టాలు తదితరాంశాలు ఉంటాయి. వీట న్నింటిపై ఎప్పటికిప్పుడు సమీక్షలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లను పురమాయించి పథకాల అమలు తీరును పరిశీలించాల్సి ఉంటుంది. వాటి పురోగతిని పర్యవేక్షించాలి. కానీ అవేవీ జరగటం లేదు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర కుటుంబ సామాజిక సర్వే (సీపెక్స్) ప్రకారం ఇప్పటికీ కరెంటు లేని దళితవాడలు, నల్లా కలెక్షన్ లేని ఆదివాసీ, గిరిజన గూడేలు, ఇండ్లులేని బలహీనవర్గాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కరించా ల్సిన ఉన్నతాధికారులను ఆయా శాఖలకు నియమించక పోవటంతో సంక్షేమం వెనకపట్టు పట్టింది.
మరోవైపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ చెక్కుల కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు ఎవరైనా జోక్యం చేసుకుంటేనే తప్ప అవి విడుదల కాని పరిస్థితి. సిఫారసులు, పైరవీలు చేయించుకు నే శక్తి సామర్థ్యాలున్న వారికే ఆ చెక్కులు సకాలంలో అందు తున్నాయి. లేదంటే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ‘వెల్ఫేర్ వీక్…’ ఎలా జయప్రద మవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా కీలక శాఖలకు సరైన ఉన్నతాధికారులను నియమిస్తేనే ఈ కార్యక్రమం జయ పద్రమవుతుందనే వాదనలు వినబడుతున్నాయి.
‘సంక్షేమం’పై దృష్టేది..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



