ఖాళీ బిందెలతో మహిళల నిరసన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఆన్సాన్ పల్లి గ్రామంలోని పాతపల్లిలో గత నెల రోజులుగా తాగు నీటి కటకట ఏర్పడిందని స్థానిక మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన , ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గత కొద్దీ రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడిందని, వెంటనే సమస్యను తీర్చాలని పంచాయతీ పాలకవర్గానికి, సంబంధించిన పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
మండుతున్న ఎండల నేపథ్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, దీంతో గొంతు తడుపుకోవడానికి వార్డుల్లో ఉన్న బోర్ చెడిపోయి నీటికి ఇబ్బందులకు గురివుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటికైనా పాలకవర్గం పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంచి నీటి సమస్యను పరిస్కారం చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ఇంఛార్జి కార్యదర్శిని నవతెలంగాణ వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.



