– డిపోల నుంచి కదలని బస్సులు బోసిపోయిన బస్టాండ్లు
– ప్రయివేట్ వాహనాల సందడి
– అద్దె, ఎలక్ట్రిక్ బస్సులతో నెట్టుకొచ్చిన అధికారులు
– ప్రయివేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు నోటిఫికేషన్
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు కదల్లేదు.. డ్రైవర్లు మొదలు కండక్టర్లు, మెకానిక్లు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్లు బోసిపోయాయి. మరోపక్క ప్రయివేట్ వాహనాల సందడి కనిపించింది. ఈ క్రమంలో అధికారులు పలు చోట్ల ప్రయివేటు డ్రైవర్లతో అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను నడిపించారు. బస్సు స్టీరింగ్లపై డ్రైవర్లకు నియంత్రణ కొరవడడంతో కొన్ని చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
నిజామాబాద్ రీజియన్ వ్యాప్తంగా సమ్మె ఎఫెక్ట్ కనిపించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో -1లో మొత్తం 135 బస్సులుంటే 4 బస్సులు మాత్రమే మధ్యాహ్నం వరకు తిరిగి వచ్చేశాయి. డిపో-2లోని ఎలక్ట్రిక్ బస్సులు తిరిగాయి. మిగతా చోట్ల సైతం ఇదే పరిస్థితి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. డిపోల ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో ప్రయివేటు డ్రైవర్లు సైతం మద్దతు ప్రకటించారని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడాలని సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్, వికారాబాద్ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నాలు
సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. ఇది వరకే సంస్థ హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది డ్రైవర్ల జాబితా ఆయా రీజియన్లకు వచ్చింది. వారి డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ పరిశీలనకు ట్రాన్స్పోర్ట్ అధికారులకు సిఫారసు చేయనున్నారు. అనంతరం వారికి బస్సులు అప్పగించే చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. కాగా, గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినప్పుడు ప్రయివేటు డ్రైవర్లకు బస్సులు ఇవ్వగా.. అనేక ప్రమాదాలు చోటుచేసుకొని పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారని, ప్రజల, ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి చర్యలు ఆర్టీసీ అధికారులు మానుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్లో ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ కొన్ని అద్దె బస్సులను నడిపింది. ఇందులో ఓ అద్దె బస్సు నగర పరిధిలోని అలుగునూర్లో యాక్సిడెంట్కు గురైంది. కరీంనగర్ రీజియన్లోని 11 డిపోలు స్తంభించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. గోదావరిఖని డిపోలో ప్రయివేట్ బస్సులను నడిపించారు.
వేములవాడలో ఉద్రిక్తత
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వేములవాడలో సమ్మె ఉద్రిక్తంగా మారింది. డిపో నుంచి అద్దె బస్సులను బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నించగా, కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అద్దె బస్సులను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించడంతో డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అధికారులు 180కి పైగా ఎలక్ట్రిక్, ప్రయివేటు బస్సులు నడిపారు. కండక్టర్లు లేకపోవడంతో టికెట్ లేకుండానే ప్రయాణికు లను గమ్యస్థానాలకు చేర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా(వరంగల్ రీజియన్) పరిధిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మొత్తం 9 డిపోల్లో 1036 బస్సులు కదల్లేదు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 641 బస్సులు నిలిచిపోయాయి. రీజియన్ వ్యాప్తగా 1946 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఆదిలాబాద్ డిపో ఎదుట చేపట్టిన నిరసనలో మాజీ మంత్రి జోగు రామన్న కార్మికులకు మద్దతు తెలిపారు.
అద్దె బస్సులను నడిపేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 295 అద్దె బస్సులను నడిపారు. మంచిర్యాలలో పోలీసుల ప్రమేయంతో బస్సులు నడిపే యత్నం చేయగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
బోసిబోయిన జేబీఎస్
హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్ (జేబీఎస్) వద్ద ప్రాంగణం బోసిపోయింది. సికింద్రాబాద్ రైతిఫైల్ బస్ స్టేషన్ వద్ద బస్సుల రాకపోకలు లేకపోవడంతో స్టేషన్ వెలవెలబోయింది. సమ్మె గురించి తెలియని ప్రయాణికులు నిరాశతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించారు. షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో అధికచార్జీలు వసూలు చేసినట్టు ప్రయాణికులు వాపోయారు.
ఆర్టీసీ ఎత్తుగడలకు ఖమ్మంలో చెక్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు కదల్లేదు. ఉదయం నుంచే సీఐటీయూ అనుబంధ ఎస్డబ్ల్యూఎఫ్ నాయకత్వం, ఇతర కార్మిక సంఘాల కార్యకర్తలు, నాయకులు డిపో వద్దకు చేరుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడిపించాలన్న యాజమాన్యం ఎత్తుగడలకు ఎక్కడికక్కడా అడ్డుకున్నారు. డిపోల ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వారికి సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు మద్దుతు తెలిపారు. ఉమ్మడి మెదక్లో 87 ప్రయివేటు సర్వీసులను అధికారులు నడిపించారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సుపై, డ్రైవర్పై దాడి చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కేంద్రంలో బస్సులను కార్మికులు అడ్డుకున్నారు.



