నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ సర్వే కారణంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సవివరంగా చర్చించడం జరిగింది. పెండింగ్లో ఉన్న సర్వేలను తక్షణమే పూర్తి చేసి, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. గ్రామ సర్పంచులు మరియు అధికారులు పరస్పరం సమన్వయంతో కలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రతీ అధికారికి బాధ్యత అని, సమిష్టిగా పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.



