నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె హేమంత కుమార్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు జాతీయ సేవ పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా గురువారం వ్యవసాయ యాంత్రీకరణ పై క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం జమిందార్ బంజర కు చెందిన రైతు మద్దినేని వెంకట్ గారి ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. తోటల నిర్వహణలో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాముఖ్యత పై విద్యార్థులు అవగాహన పొందారు.
ముఖ్యంగా ఆయిల్ పామ్ మట్టలను నూర్పిడి చేసే యంత్రం, గెలలను కోయడానికి ఉపయోగించే యంత్రం, అలాగే గెలలను లోడ్ చేసే యంత్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ యంత్రాల వినియోగం వల్ల శ్రమ తగ్గడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగాంజలి, డాక్టర్ జంబమ్మ, డాక్టర్ శిరీష, డాక్టర్ ఝాన్సీ రాణి, డాక్టర్ కృష్ణ తేజ, డి. స్రవంతి పాల్గొన్నారు.



