– తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ రైతు సంఘం తప్పుపట్టింది. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని కోరింది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి. సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు పది నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో దాదాపు 20 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేసిన సందర్భంగా ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయబోమంటూ ప్రభుత్వం ద్వారా రైతులకు హామీ ఇవ్వడంతో దీక్షలు విరమించారని గుర్తు చేశారు. కానీ యాజమాన్యం కంపెనీ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఈనెల 2న అర్ధరాత్రి జేసీబీలు, కంటైనర్లు, టిప్పర్లు తదితర వాహనాలతోపాటు కూలీలతో వచ్చారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అరెస్టయిన రైతులందరినీ బేషరతుగా విడుదల చేయాలనీ, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES