– 17 లక్షల కోట్ల భారమంటూ తప్పుడు ప్రచారం
– వాస్తవ ఖర్చు 50 వేల కోట్లేనంటున్న నిపుణులు
– అన్నదాతకు బడ్జెటరీ మద్దతు కూడా కరువు
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలంటూ రైతులు భారత్ గ్రామీణ బంద్తోపాటు ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా భారం పడుతుందని సర్కారు వాదిస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న మీడియాకు తప్పుడు సమాచారాన్ని అందిస్తూ ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఎంఎస్పీకి చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు గతంలో దేశ రాజధానిలో సంవత్సరం పాటు సుదీర్ఘ ఆందోళన సాగించిన విషయం తెలిసిందే. రైతుల నిరసనకు తలవంచిన మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ కనీస మద్దతు ధరల డిమాండ్ను మాత్రం అంగీకరించలేదు.
ప్రైవేటు కొనుగోలుదారులపై ఒత్తిడి తెస్తే…
రెండు రకాలుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించవచ్చునని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది… పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ చెల్లించాలని ప్రైవేటు కొనుగోలుదారులపై ఒత్తిడి తేవడం. ఈ పద్ధతిలో ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు ఏ పంటనూ కొనుగోలు చేయకూడదు. మార్కెట్లలో జరిగే వేలంలో కూడా ఎంఎస్పీయే ప్రారంభ ధరగా ఉంటుంది. ప్రైవేటు కొనుగోలుదారులు ఎంఎస్పీ చెల్లించడానికి ఓ పద్ధతి ఉంది. చెరకు పంటకు సంబంధించి కేంద్రం నిర్ణయించిన గిట్టుబాటు ధరకే చక్కెర మిల్లులు పెంపకందారులకు ధరను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి చట్టబద్ధత ఉంది. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు కేంద్రం సూచించిన ధర కంటే ఎక్కువ ధరనే నిర్ణయిస్తున్నాయి. సరఫరా చేసిన 14 రోజుల్లో సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. మరే ఇతర పంటలోనూ ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీని ప్రైవేటు వ్యాపారులు చెల్లించాలన్న నిబంధన లేదు.
వాస్తవానికి దూరంగా…
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.17 లక్షల కోట్ల భారం పడుతుందని మోడీ సర్కారు చెబుతోంది. అయితే ఈ వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదు. లక్షిత పథకం లేదా ధరల స్థిరీకరణ నిధిలో భాగంగా ఎంఎస్పీ చెల్లింపుల కోసం ప్రభుత్వంపై పడే భారం రూ.50 వేల కోట్లకు మించదని నిపుణులు స్పష్టం చేశారు. ఎంఎస్పీ వర్తించే 23 పంటల మొత్తం ఉత్పత్తి విలువ 2019-20లో రూ.10.78 లక్షల కోట్లు. పైగా ఈ ఉత్పత్తులన్నింటినీ మార్కెట్ చేయరు. వీటిలో కొంత భాగాన్ని రైతులు సొంత అవసరాల కోసం భద్రపరచుకుంటారు. తదుపరి పంట కోసం విత్తనాలుగా వినియోగి స్తారు. పశువుల దాణాకు కూడా ఉపయోగి స్తారు. ఇదంతా పోను మార్కెట్కు చేరే పంట విలువ రూ.8 లక్షల కోట్లు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, పత్తి, పప్పులు, చమురు గింజలను ఎంఎస్పీకి కొనుగోలు చేస్తోంది. చెర కును చక్కెర మిల్లులే కొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వంపై పడే అదనపు భారమేమీ పెద్దగా ఉండదు.
అడుగడుగునా వివక్షేఏదేమైనా రైతుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నది స్పష్టమవుతోంది. రైతులకు బడ్జెటరీ మద్దతు కూడా సరిగా ఉండడం లేదు. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బడ్జెటరీ కేటాయింపులు తగ్గిపోతున్నాయి. 2022-23లో వాస్తవ వ్యయంతో పోలిస్తే
ఈ కేటాయింపులు 22.3శాతం తగ్గాయి. 2023-24 సవరించిన బడ్జెట్లో సైతం 6శాతం తగ్గాయి. మోడీ ప్రభుత్వం వరుసగా పదోసారి రైతు వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఇటీవల ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) విమర్శించింది. రైతులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న ఎంఎస్పీకి బడ్జెట్లో కేటాయింపులే లేవని గుర్తు చేసింది.
ప్రభుత్వమే కొనుగోలు చేస్తే…
ఇక రెండో మార్గం… రైతులు పండించిన పంట మొత్తాన్నీ ప్రభుత్వమే ఎంఎస్పీకి కొనుగోలు చేయడం. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. 2019-20లో ఎఫ్సీఐ, భారత జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు 77.34 మిలియన్ టన్నుల ధాన్యాన్ని, 38.99 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించాయి. ధాన్యం సేకరణ కోసం రూ.140,834 కోట్లు, గోధుమల సేకరణ కోసం రూ.75,060 కోట్లు చెల్లించాయి. దీంతో పాటు రూ.28,202 కోట్లతో 105.23 పత్తి బేళ్లను కూడా కొనుగోలు చేశాయి. రూ.10,238 కోట్ల ఎంఎస్పీతో 2.1 మిలియన్ టన్నుల శనగలు, రూ.4,176 కోట్లతో 0.7 మిలియన్ టన్నుల బఠానీలు, రూ.3,614 కోట్లతో వేరుశనగ, రూ.3,540 కోట్లతో 0.8 మిలియన్ టన్నుల మినుములు, రూ.987 కోట్ల ఖర్చుతో 0.1 మిలియన్ టన్నుల పెసలను కూడా ప్రభుత్వం
కొనుగోలు చేసింది.
కోతల బడ్జెట్…
2022-23లో వ్యవసాయ సబ్సిడీకి అయిన వాస్తవ ఖర్చుతో పోలిస్తే 2024-25లో రూ.87,339 కోట్లు తక్కువ కేటాయించారు. ఆహార సబ్సిడీ కేటాయింపులో కూడా రూ.67,552 కోట్ల కోత పడింది. గ్రామీణాభివృద్ధి పథకాలు, ప్రధానమంత్రి కిసాన్ సంచాయి యోజన, సహకారం, ఆహార నిల్వ-గిడ్డంగులు, ప్లాంటేషన్, వరద నివారణ-డ్రైనేజీ, భూసంస్కరణలు, ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ, పాడి పరిశ్రమ అభివృద్ధి, నేల-నీటి పరిరక్షణ, నీటిపారుదల, పౌష్టికాహారం, గ్రామీణ రోడ్లు, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య రంగాలకు కూడా బడ్జెట్లో కోత విధించారు. రైతులు, గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్లో మోడీ ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రభుత్వం తన ద్రవ్య విధానంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోంది. రైతుల సంక్షేమాన్ని, ఆర్థిక బాగోగులను ఫణంగా పెట్టి కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.