Sunday, June 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరోపణలు..ప్రత్యారోపణలు

ఆరోపణలు..ప్రత్యారోపణలు

- Advertisement -

– అధికార, ప్రతిపక్షం ఢీ అంటే ఢీ
– ఆయుధాలుగా కాళేశ్వరం, బనకచర్ల
– ప్రజాసమస్యలు గాలికి
– స్థానిక ఎన్నికల ‘పంచాయితీనా’ !?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రూపుమార్చుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్నది. ఆరోపణలు, విమర్శలతో కాలం వెల్లదీస్తున్నాయి. వెరసీ ప్రజాసమస్యలు గాలికిపోతున్నాయి. ఒకటి, రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో నాయకులు ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సాధారణ పథకాలకు సైతం నిధుల్లేక లబ్దిదారులు ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తాయి. ఆదాయం లేకపోవడంతో కనీస ఖర్చులకు కూడా డబ్బులు సరిపోవడం లేదని పదే పదే చెప్తున్న సీఎం రేవంత్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల అంశాన్ని ఎజెండా చేసి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగానే బీఆర్‌ఎస్‌ సైతం గొంతెత్తుతున్నది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం గోదావరి బేసిన్‌లో అనుమతుల్లేకుండా రూ.82 వేల కోట్లతో తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహారచన చేసుకుంది. ఇటు తెలంగాణలోని కాళేశ్వరం అవినీతి, అక్రమాలు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం, అటు ఏపీలోని ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఆయుధాలుగా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ప్రజాసమస్యలు గాలికిపోతున్నాయి. వానాకాలం వచ్చింది. అన్నదాతలకు రైతుభరోసా సాయం రావాల్సి ఉంది. ఇందుకు రూ. 9 వేల కోట్లు కావాలి. ఇందుకోసం బాండ్లను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నది. సాధారణ ప్రజలకు పింఛన్లు కావాలి. ప్రభుత్వ పథకాలకు నిధులు అందడం లేదు. రూ.వేల కోట్లల్లో పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. ఉద్యోగులకు డీఏలు ఇవ్వాల్సి ఉంది. పీఆర్సీ సంగతి మరిచేపోయారు. నిధులు లేవంటూ వాస్తవాలను చెప్పడం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకోవచ్చనే ఆలోచనలో సీఎం రేవంత్‌ ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితిని బీఆర్‌ఎస్‌ వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. పథకాలకు నిధుల్లేవంటూ ఒకసారి, రైతు భరోసా ఇవ్వటంలేదంటూ మరోసారి ప్రభుత్వంపై దాడి చేస్తున్నది. బనకచర్ల, కాళేశ్వరంపై పదే పదే ప్రెస్‌మీట్లు, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నది. అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఒకట్రెండు నెలల్లో ఇవి ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకే అధికార, ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నాయనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -