– సముద్రంలో రోహింగ్యాల నెట్టివేత
– అసోం నుంచి శరణార్థుల గెంటివేత
– విదేశీయులు, చొరబాటుదారులుగా ముద్ర
– అమానుషంగా ప్రవర్తించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారత్-పాక్ ఘర్షణను ప్రధాని మోడీ, ఆయన పార్టీ సహచరులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రధానస్రవంతి మీడియా కూడా ఆపరేషన్ సిందూర్పై అనేక కథనాలు వండి వార్చింది. కానీ, ఈశాన్య భారతంలో జరిగిన ఓ అమానవీయ ఎపిసోడ్ను ఎవరూ పట్టించుకోలేదు. కేరళకు చెందిన డిజిటల్ వార్తా వేదిక మక్తూబ్ మీడియా ముందుగా దీనిని బయటపెట్టింది. 40 మంది రోహింగ్యాలను మయన్మార్ తీరం సమీపంలో ఓ నౌక నుంచి సముద్రంలోకి నెట్టేశారని భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన రెండు రోజులకు… అంటే మే 12న మక్తూబ్ మీడియా తెలిపింది. వీరంతా భారత్లో ఉంటున్న శరణార్థులుగా, ఏ దేశానికీ చెందనివారిగా ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ వద్ద నమోదైన వారే.
గంతలు కట్టి…సంకెళ్లు వేసి
సైనిక దాష్టీకాల నుంచి తప్పించుకోవడానికి 2017లో మయన్మార్ నుంచి పారిపోయినవారే రోహింగ్యాలు అనే విషయం విదితమే. రోహింగ్యాలను చట్టానికి లోబడి దేశం నుంచి బయటకు పంపుతామని మే 8న సొలిసిటర్ జనరల్(ఎస్జీ) సుప్రీంకోర్టుకు నివేదించారు. కానీ, అందుకు భిన్నంగా వారి పట్ల అమానుషంగా వ్యవ హరించిన తీరు బయట పడింది. రోహింగ్యాలను ముందుగా పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆ తర్వాత అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు పంపారు. అక్కడ కండ్లకు గంతలు కట్టి, సంకెళ్లు వేసి ఓడలోకి ఎక్కించారు. ఆపై సముద్రంలోకి నెట్టేశారు. ఆ రోహింగ్యాల బృందంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని మక్తూబ్ మీడియా తెలిపింది. వారిలో కొందరు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ ఉదంతంపై ఆ తర్వాత స్క్రోల్ పోర్టల్లో కూడా ఓ కథనం వచ్చింది.
విదేశీయులుగా ముద్ర వేసి…
అసోంలో ఉంటున్న అనుమానిత బంగ్లాదేశ్ జాతీయులను వెనక్కి పంపే ప్రక్రియ కూడా అమానవీయమైనదే. రోహింగ్యాలపై స్వతంత్ర డిజిటల్ వేదికలలో వచ్చిన కథనాలు హృదయాలను కదిలిస్తున్నాయి. భారత్-బంగ్లా సరిహద్దుల మీదుగా బలవంతంగా బయటకు పంపిన వారిలో ఎక్కువ మంది వివాహిత మహిళలే. వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. ఓ ఉపాధ్యాయురాలిని గెంటేశారనీ, మరో ఇద్దరు మహిళలను బయటకు పంపిన తర్వాత వారు భారతీయులేనని తేలడంతో తిరిగి తీసుకొచ్చారని స్క్రోల్ పోర్టల్లో ఓ కథనం ప్రచురితమైంది. రోహింగ్యాల కథనాలు వింటుంటే ఓ విషయం గుర్తుకొస్తుంది. గతంలో అసోం ప్రభుత్వం పౌరుల జాతీయ రిజిస్ట్రేషన్(ఎన్నార్సీ) ప్రక్రియను చేపట్టింది. 2019లో క్వాసీ-జ్యుడీషియల్ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్స్ ఒక్కసారిగా లక్షలాది మందిని విదేశీయులుగా ప్రకటించాయి. దీంతో వారు ఎంతో డబ్బు ఖర్చు చేసి, న్యాయవాదులను నియమించుకొని ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ ప్రక్రియ పేదలు, నిరక్షరాస్యులు… ముఖ్యంగా వివాహిత మహిళలపై ప్రభావం చూపింది. మహిళల్ని నిర్బంధ కేంద్రాలకు పంపారు. బెయిల్పై విడుదలైనప్పటికీ తిరిగి అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో అప్పీలు పెండింగులో ఉన్నప్పటికీ బంగ్లాదేశ్కు పంపారు.
బలం కాదు… బలహీనతే
రోహింగ్యాల విషయంలో కానీ, అసోంలో నివసిస్తున్న శరణార్థుల విషయంలో కానీ ప్రధాన స్రవంతి మీడియా ఎలాంటి కథనాలూ ఇవ్వడం లేదు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకున్నామనీ, ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండువేల మంది అక్రమ వలసదారులను గెంటేశామని అధికారులు చెప్తున్న మాటలనే అవి ప్రచురిస్తున్నాయి. కొందరు వలసదారులు వారంతట వారే దేశాన్ని వదిలి వెళ్లిపోయారని అధికారులు అంటున్నారు. ఈ కథ ఇవాళో, రేపో ముగిసిపోదు. దేశంలోని ఓ మారుమూల ఈశాన్య ప్రాంతంలో ఏం జరుగుతోందో చెప్పడం కూడా మీడియా బాధ్యతే. తాము ఎంత నిర్ణయాత్మకంగా, బలంగా ఉన్నామో చెప్పుకోవడానికి ప్రభుత్వాలు బలహీనులను ఎంచుకుంటాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. పడవ నుంచి నీటిలో నెట్టేయడం, ఎనిమిది నెలల పసికందుతో ఉన్న తల్లిని సరిహద్దు దాటించడం, ఆమెతో పాటు అనేక మందిని రాత్రంతా నిలబెట్టడం వంటి ఘటనలు ప్రభుత్వ బలాన్ని ఎంతమాత్రమూ సూచించవు. అత్యంత దుర్బలులైన వారి విషయంలో ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందన్న విషయాన్ని మాత్రమే బయటపెడతాయి.
ఇదేనా ప్రభుత్వ విధానం?
మయన్మార్లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితికి చెందిన టామ్ ఆండ్రూస్ గొంతు విప్పిన తర్వాతే ప్రధానస్రవంతి మీడియా కండ్లు తెరిచింది. ”రోహింగ్యా శరణార్థులను నౌక నుంచి సముద్రంలో పడదోయాలన్న ఆలోచనే దారుణమైనది. దీనిపై నేను మరింత సమాచారాన్ని, ఆధారాలను కోరుతున్నాను. ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆయన అన్నారు. ఈ అమానుషంపై న్యూయార్క్ టైమ్స్, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, స్ట్రెయిట్ టైమ్స్లో వార్తలు వచ్చిన తర్వాత ప్రధానస్రవంతి మీడియా దానిపై దృష్టి సారించించింది. అయినప్పటికీ స్వతంత్ర డిజిటల్ వేదికలలో తప్ప పెద్దగా స్పందన కనిపించలేదు. స్క్రోల్ పోర్టల్లో హర్ష్ మందిర్ మాత్రం తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ”అసాధారణమైన క్రూరత్వం, పక్షపాతం, రాజ్యాంగ కర్తవ్యాల విస్మరణ, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు భారత్ కేంద్రంగా మారింది. అదే ప్రభుత్వ విధానంగా తయారైంది” అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఎవరికీ పట్టని అభాగ్యులు
ఆనాడు తగిన పత్రాలు లేనివారికి ఎలాంటి న్యాయమూ జరగలేదు. సహాయం చేసేందుకు ముందుకొచ్చిన న్యాయవాదులకు తమ వద్ద ఉన్న పత్రాలను చూపించడానికి పురుషులు, మహిళలు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. విచారణకు హాజరయ్యేందుకు ఎంతో దూరం ప్రయాణించి వస్తే అది కాస్తా వాయిదా పడేది. పాత్రికేయులు సహా విచారణకు ఎవరినీ అనుమతించలేదు. ఐదేండ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ సిందూర్ను సాకుగా చూపి, వారిపై చొరబాటుదారులుగా ముద్ర వేసి గెంటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆనాడు విదేశీయులుగా ట్రిబ్యునల్స్ ప్రకటించిన వేలాది మందిని సరిహద్దులు దాటించే పని మొదలైంది. వీరు సరిహద్దుల వద్ద పట్టుబడినవారు కారు… పత్రాలు లేకుండా మోసపూరితంగా దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నించినవారు అంతకంటే కారు… వారంతా అసోంలో చాలా కాలం నుంచి ఉంటున్న వారే. భారత పౌరులే. విదేశీయులుగా ప్రకటించిన వారిని ఇటు భారత్ కానీ, అటు బంగ్లాదేశ్ కానీ తమ పౌరులుగా అంగీకరించడం లేదు. అసోంలో పౌరసత్వ గందరగోళం ఇక్కడే ప్రారంభమైంది.