Monday, June 9, 2025
E-PAPER
Homeజాతీయంనరం లేని నాలుకలు !

నరం లేని నాలుకలు !

- Advertisement -

స్వదేశంలో హిందూత్వవాదం
విదేశాలలో లౌకిక నినాదం
బీజేపీ, శివసేన నేతల ‘శాంతి’ ప్రవచనాలు
33 దేశాల్లో పర్యటించినా సాధించింది శూన్యమే
న్యూఢిల్లీ :
బీజేపీ నాయకుల ప్రతి మాటలోనూ హిందూత్వ భావజాలమే కన్పిస్తుంటుంది. కానీ ఒక్కో సందర్భంలో అవసరార్థం వారు తమ మనసులోని మాటను బయటపెట్టకుండా తేనె పలుకులతో ఎదుటివారిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా జరిగింది ఇదే. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ వైఖరిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు మోడీ ప్రభుత్వం దౌత్యవేత్తలు, వివిధ పార్టీల నేతలతో కూడిన ప్రతినిధి బృందాలను 33 దేశాలకు పంపిన విషయం తెలిసిందే. ఈ బృందాలలోని బీజేపీ, శివసేన సభ్యులు భారత్‌ను ఓ లౌకిక దేశంగా చిత్రించేందుకు, దేశంలోని ముస్లింలకు సమాన హక్కులు లభిస్తున్నాయని… వారు ఎలాంటి హింసనూ ఎదుర్కోవటంలేదని నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇది వారి కరుడుగట్టిన హిందూత్వ వైఖరికి పూర్తి భిన్నంగా ఉంది. అయినప్పటికీ అలా చెప్పుకోవటం వారికి తప్పడం లేదు. స్వదేశంలో మాట్లాడే మాటలకు పూర్తి విరుద్ధంగా చిలక పలుకులు పలుకుతూ ఆయా దేశాల వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టు స్వదేశంలో బీజేపీ నేతలు మాట్లాడే భాషను ఒంటపట్టించుకొని విదేశాలలో పాకిస్తాన్‌ను తిట్టిపోస్తున్నారు.
ముస్లింలకు సమాన హక్కులు ఉన్నాయట..!
బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే పదునైన, ఇస్లామోఫోబిక్‌ వ్యాఖ్యలకు సుప్రసిద్ధుడు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీని ఏప్రిల్‌లో ‘ముస్లిం కమిషనర్‌’ అని ఎగతాళి చేశారు. ఇంతకీ ఖురేషీ చేసిన తప్పేమిటంటే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడమే. మరి ఇప్పుడు దూబే ఏం చేస్తున్నారు? భారత్‌లో ముస్లింలు సమాన హక్కులు అనుభవిస్తున్నారంటూ లెక్చర్లు దంచేస్తున్నారు. తన ప్రతినిధి బృందంలో వివిధ మతాలకు చెందిన సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమంపై మాట్లాడుతూ భారత్‌ ఎప్పుడూ రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్ధిస్తుందని తెలిపారు. ‘పాలస్తీనా, ఇజ్రాయిల్‌ విషయంలో భారత్‌ వైఖరిపై అపోహలు ఉన్నాయి. మా బృందంలో మజ్లిస్‌ అధినేత ఓవైసీ కూడా సభ్యుడే. పాకిస్తాన్‌లో కంటే భారత్‌లోనే ముస్లింలు ఎక్కువగా ఉన్నారని ఆయన చెబుతున్నారు’ అని అల్జీరియాలోని అల్జీర్స్‌లో ఏఎన్‌ఐ వార్తా సంస్థతో దూబే అన్నారు. పైగా ఆయన వితండవాదానికి కూడా దిగుతున్నారు. ‘సమస్యలు లేని ఇల్లు ఉంటుందా? హిందువులకు ఒకరితో ఒకరికి సమస్యలు ఉండవా? మా ప్రతినిధి బృందంలో ఐదు మతాలకు చెందిన వారున్నారు. అందరిదీ ఒకే గొంతుక. ఒకరినొకరు సమర్ధించుకుంటాం’ అని తెలిపారు.
పాలస్తీనాపై పచ్చి అబద్ధాలు
బీజేపీ ఎంపీ వైజయంత్‌ పాండా నేతృత్వంలోని బృందంలో సభ్యుడైన దూబే మస్లిం దేశాలైన సౌదీ అరేబియా, కువైట్‌, బహ్రెయిన్‌, అల్జీరియాలో పర్యటించారు. అక్కడ ఆయన ‘లౌకిక’ భారతానికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు మద్దతు ఇచ్చే వారు భారత్‌కు గిట్టరన్న విషయం తెలిసిందే. కానీ విదేశాలలో పర్యటిస్తున్న ప్రతినిధి బృందాలు మాత్రం మనం రెండు దేశాలు సిద్ధాంతాన్ని నమ్ముతున్నామని చెబుతున్నాయి. భారత్‌ హమాస్‌కు వ్యతిరేకమనీ, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వబోదని, పాలస్తీనా ప్రజల వెంటే ఉన్నదని నమ్మకంగా అంటున్నాయి. భారత్‌లో ముస్లింల పరిస్థితి ఇతర లౌకిక దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నదని వారు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 సమాన హక్కులు కల్పిస్తోందని ఓవైసీ చెప్పుకొచ్చారు. ‘ఉగ్రవాదాన్ని సహించబోమన్న ప్రధాని మోడీ అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేశాం. ప్రజలకు ఆహారం అందించడానికి పాక్‌ వద్ద డబ్బు కూడా లేదని చెప్పాం. ఉగ్రవాద చర్యలకు స్వస్తి చెప్పాలని, లేకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని పాకిస్తాన్‌కు తేల్చి చెప్పాల్సిందిగా ఆయా దేశాలను కోరాం. పాకిస్తాన్‌కు డబ్బు అందించే ఏ దేశమైనా…అమెరికా కానీ, ఐఎంఎఫ్‌ కానీ, ప్రపంచబ్యాంక్‌ కానీ…ఎవరు సాయం చేసినా అది సైన్యం అవినీతిలో కొట్టుకుపోతుందని చెప్పాము’ అని ఓవైసీ వివరించారు.
పాక్‌తో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నారట..!
ఓ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన పాండా బహ్రెయిన్‌లోని మనామాలో భారత్‌ వైఖరిని వివరించే సమయంలో ఆచితూచి వ్యవహరించారు. ‘చర్చలు, ఉగ్రవాదం కలసి నడవవు’, ‘రక్తం, నీరు కలసి ప్రవహించవు’ వంటి బీజేపీ నేతల మాటలనే పాండా వల్లెవేశారు. భారత్‌ స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటోందని ముక్తాయింపు ఇచ్చారు. ‘మా బృందంలోని సహచరులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. వేర్వేరు భాషలు మాట్లాడతారు. ఇది నిజమైన భారతదేశం. మానవ చరిత్రలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇదే అతి పెద్ద సందేశం. గతంలో పాక్‌తో క్రికెట్‌ ఆడాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడంతా మారిపోయింది’ అని ఆయన అన్నారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పటికీ గత ప్రభుత్వాలు పాకిస్తాన్‌తో చర్చలు జరిపాయని ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మోడీ ప్రభుత్వం విమర్శలు సంధించింది. అయితే పాలక పార్టీకే చెందిన పాండే మాటలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పాక్‌తో చర్చించడానికి భారత్‌ సిద్ధమేనని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ తన ‘బుల్లెట్‌’ గురించి పాక్‌ పౌరులను హెచ్చరిస్తే ఈ ప్రతినిధి బృందాలు మాత్రం పాకిస్తాన్‌ ప్రజలకు వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. పాక్‌ పౌరులు శాంతిని కోరుకుంటున్న విషయం తమకు తెలుసునని, అయితే అక్కడి సైన్యానికి విశేషాధికారాలు ఉన్నాయని అన్నారు. ప్రతినిధి బృందంలో సభ్యుడైన కాంగ్రెస్‌ మాజీ నేత, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను పాండా పొగడ్తలతో ముంచెత్తారు.
హిమాన్షిని మరిచారేం?
బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌కు వెళ్లిన ప్రతినిధి బృందానికి బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ నాయకత్వం వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన ‘నవ వధువు’ యొక్క మానవ హక్కులను ఆయన ప్రస్తావించారు. అయితే ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్‌ వినరు నర్వల్‌ భార్య హిమాన్షి నర్వల్‌ పేరును ఆయన మాట మాత్రంగా అయినా ఎత్తలేదు. అందుకు కారణం లేకపోలేదు. హిమాన్షి శాంతిని సమర్ధించారు. ముస్లింలు, కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకోవడానికి దాడి ఓ సాకుగా మారకూడదని అన్నారు. దీంతో ఆమెను ఎగతాళి చేస్తూ సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్‌ చేశారు. బహుశా అందుకే ఆమె పేరును ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు.
లౌకికవాదం ముసుగు ఎవరిది?
2019లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత మోడీ మాట్లాడుతూ ‘ఈ ఎన్నికలలో ఒక్క పార్టీ కూడా లౌకికవాదం ముసుగు ధరించి దేశాన్ని తప్పుదోవ పట్టించే ధైర్యం చేయలేదు’ అని ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ఆయన పంపిన ప్రతినిధి బృందాలు ఏం చెబుతున్నాయి? భారత్‌ ఓ లౌకిక దేశమేనని అంటున్నాయి. అన్ని మతాలు శాంతిని కోరుకుంటాయని, సామరస్యంతో మెలగుతాయని, ఎవరూ యుద్ధాన్ని కోరుకోరని శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే లైబీరియాలో ప్రతినిధుల సభ స్పీకర్‌తో జరిపిన సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఎన్డీఏ ఎంపీలే కాదు…ప్రతిపక్ష ఎంపీలు కూడా తాము ఎన్నడూ ఉపయోగించని భాషను వాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మజ్లిస్‌ నేత ఒవైసీపై బీజేపీ నాయకులు తరచూ మండిపడుతుంటారు. ఓ బీజేపీ ఎంపీ అయితే పాకిస్తాన్‌ వెళ్లాల్సిందిగా ఆయనకు సలహా ఇచ్చారు కూడా. అదే ఒవైసీ కువైట్‌లో పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు.
భారత్‌లో ముస్లింలకు ఎలాంటి బెదిరింపులు ఉండవని, పాక్‌లో కంటే తమ దేశంలోనే ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారని చెప్పారు. ముస్లింల హక్కులను హరించేందుకు బీజేపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో ఆయన గతంలో పార్లమెంటులోనే వివరించారు. సాధారణంగా బీజేపీ నేతలే పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో ఒవైసీ కూడా చేరిపోయారు.
ఆయన రూటే సపరేటు
కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ ప్రతినిధి బృందంలో చేరినప్పటి నుండీ పార్టీలో చెలరేగిన రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. 2016లో యురిలో దాడి జరిగినప్పుడు భారత్‌ నియంత్రణ రేఖను దాటి పాక్‌పై సర్జికల్‌ స్ట్రయిక్‌ జరిపిందని ఆయన పనామాలో చెప్పారు. అయితే ఆయన 2018లో రాసిన ఓ పుస్తకంలోని ఓ భాగాన్ని కాంగ్రెస్‌ నేతలు తాజాగా విడుదల చేశారు. 2016లో బీజేపీ ప్రభుత్వం జరిపిన దాడులను ‘సిగ్గుమాలిన దోపిడీ’గా అందులో ఆయన అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -