హైదరాబాద్ చేరుకున్న ఎస్ఐబీ మాజీ ఐజీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్రావు అమెరికా నుంచి ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన ఇబ్రహీంబాగ్లోని తన విల్లాకు వెళ్లారు. కాగా, సోమవారం ఫోన్ట్యాపింగ్ కేసును దర్యాప్తు జరుపుతున్న జూబ్లీహిల్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అధికారుల ఎదుట హాజరు కానున్నారు. అమెరికాలో తన చికిత్స నిమిత్తం ఉంటున్న ప్రభాకర్రావు ఈ కేసులో కీలక నిందితుడని సిట్ తేల్చింది. ఏడాది కాలంగా ఆయ న్ను విచారించడానికి సిట్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఇంటర్పోల్ సహాయాన్ని కూడా అర్థించారు. తనకు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో ప్రభాకర్రావు ప్రయత్నించారు. బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు ప్రభాకర్రావు మాత్రం వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అప్పటివరకూ చట్టపరంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని దర్యాప్తు అధికారులకు సూచించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన పాస్పోర్టు సహాయంతో ప్రభాకర్రావు హైదరా బాద్కు చేరుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులతో పాటు వ్యాపారులు, పలువురు సినీ ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ చేయాలని ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు అంతర్గతంగా తన అధికార బృందానికి ఆదేశించినట్టు ఆరోపణలు న్నాయి. ఎస్ఐబీ కార్యాలయంలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుని ఆధునిక పరికరాల ద్వారా ఆయన కిందిస్థాయి సిబ్బంది ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సిట్ దర్యాప్తులో తేల్చింది. అరెస్టు చేసిన నలుగురు అధికారులు సైతం ప్రభాకర్రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్టు వాగ్మూలం ఇచ్చారు. అందులో కీలక పాత్ర వహించిన ఐ న్యూస్ సీఈఓ శ్రవణ్రావు సైతం ప్రభాకర్రావు ఆదేశాల మేరకే వ్యవహారాలు నడిపించినట్టు సిట్ దర్యాప్తులో ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఎదుట విచారణ హాజరుకాబోతున్న ప్రభాకర్రావును విచారించడానికి ప్రశ్నల జాబితాతో సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా, ఏ నాయకుల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు? కీలక నేతలు ఎవరెవరు దాని వెనుక ఉన్నారు? మొత్తం వ్యవహారాన్ని ఎవరు నడిపించారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు సందించనున్నట్టు తెలిసింది. మొత్తంమీద ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా పేర్కొనబడుతున్న మాజీ ఐజీ ప్రభాకర్రావు దర్యాప్తు అధికారుల ముందు ఎలాంటి నిజాలను బయటపెట్టబోతున్నారనే ఉత్కంఠ ఇటు బీఆర్ఎస్తో పాటు అన్ని రాజకీయ పక్షాల్లో నెలకొంది. ఇప్పటికే సిట్ దర్యాప్తు జరిపే జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం వద్ద ప్రభాకర్రావు విచారణ కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తిచేసినట్టు తెలిసింది. మరోవైపు పశ్చిమ మండలం డీసీపీ విజరుకుమార్తో పాటు కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో పాటు మరికొందరు అధికారులు సమావేశమై ప్రభాకర్రావును విచారించే అంశాలపై చర్చించారని తెలిసింది.
నేడు సిట్ విచారణకు ప్రభాకర్రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES