డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు నిర్వహణ
విశాఖపట్నం : ఎన్నో పోరాటాల కేంద్రం, ఉక్కు నగరం మరో చరిత్రాత్మక సంఘటనకు వేదికగా నిలువనుంది. కార్మిక హక్కుల ఉద్యమ సారధి, ఐక్య పోరాటాల పతాక సీఐటీయూ 18వ అఖిలభారత జాతీయ మహాసభకు విశాఖపట్నం ఆతిధ్యమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అఖిల భారత మహాసభ నిర్వహించనున్నట్టు సీఐటీయూ కోశాధికారి సాయిబాబు ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న 1300 మంది ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో పాటు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న నేపథ్యంలో సీఐటీయూ మహాసభ విశాఖలో జరగనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక కార్మికులు ఏళ్లతరబడి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాసభ నిర్వహణ కోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటు సమావేశం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వివరించారు. వీటికి వ్యతిరేకంగా జులై 9న జరగనున్న అఖిలభారత సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు విశాఖపట్నంను ప్రయోగశాలగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, సీఐటీయూ మహాసభను విజయవంతం చేయడం ద్వారా ఆ కుట్రను తిప్పికొట్టాలని అన్నారు. నాడు డీసీఐ రక్షణ పోరాటంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తొలి అడుగు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే స్టీల్ప్లాంట్ను ప్రయివేటీకరిస్తున్న ఎన్డీఏ పక్షాన నిలవడం దురదృష్టకరమన్నారు. అనంతరం సిహెచ్ నర్సింగరావు చైర్మెన్గా, ఆర్కె ఎస్వి కుమార్ ప్రధాన కార్యదర్శిగా, ఎవి నాగేశ్వరరావు కోశాధికారిగా ఆహ్వానసంఘం ఎన్నికైంది.
పోరాటాల కేంద్రం విశాఖ వేదికగా..సీఐటీయూ 18వ జాతీయ మహాసభ
- Advertisement -
- Advertisement -