పోలీసుల హెచ్చరికను తోసిపుచ్చిన ప్రభుత్వం !
బెంగళూరు : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయ వేడుకల్లో జరిగిన పొరపాట్లపై పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నిందారోపణలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విధాన సౌధ డీసీపీ విడుదల చేసిన లేఖతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధానసౌధ ఆవరణలో అధికంగా జనం గుమిగూడతారని, సమయం లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి పోలీసులు తీసుకెళ్లినట్లు లేఖలో స్పష్టమైంది. విధాన సౌధ వేడుకలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదన్నది నిజమే అయినప్పటికీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన విధానసౌధలో బహిరంగ కార్యక్రమం నిర్వహించడం, జూన్ 4 ఉదయం విక్టరీ పరేడ్ ఉంటుందని ఏకపక్షంగా ప్రకటించడంతో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారని, చివరికి అది చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు దారితీసిందని పోలీసుల వాదన. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ఫైనల్స్లో గెలిస్తే వారికి సన్మానం చేయడంపై అభిప్రాయాన్ని కోరుతూ.. జూన్ 3న విధాన సౌధ డీసీపీకి పరిపాలనా సంస్కరణలశాఖ (డీపీఏఆర్) లేఖ రాసింది. జూన్ 4న ఈ లేఖపై విధాన సౌధ డీసీపీ ఎంఎన్ కరిబసవగౌడ స్పందించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ఆర్సీబీ అభిమానులు గుమిగూడుతారని, విధాన సౌధ డివిజన్లో భద్రతా సిబ్బంది కొరత ఉన్నందున బందోబస్తు చేయడం సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బయట నుంచి ఎక్కువ మంది సిబ్బందిని మోహరించడం, శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయపరచడానికి సమయం లేదని తెలిపారు. విధానసౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎక్కువ సమయం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి పోలీసులు కట్టుబడి ఉంటారని అన్నారు. సన్నాహాలు చేయడానికి తగినంత సమయం లేదని చెబుతూ, వేడుకలను జూన్ 8 (ఆదివారం)కి వాయిదా వేయాలని సూచించారని పలువురు అధికారులు తెలిపారు. వారి సూచనను తోసిపుచ్చారని సమాచారం.
భద్రతా ఏర్పాట్లకు సమయం లేదు
- Advertisement -
- Advertisement -