మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని బేతాళుని గుడి మంటప స్తంభాలమీద ఉన్న రెండు శాసనాలలో రెండు జైనబసదులు 1. బద్దిగ జినాలయం, 2. కీర్తివిలాస శాంతిజినాలయం ప్రస్తావించబడ్డాయి. ఎల్లమ్మగుడి, హనుమాండ్ల గుడి, బేతాళునిగుడి మూడుచోట్ల కూడా జైనబసదుల ఆనవాళ్ళు లభిస్తున్నాయి.
హనుమాన్ గుడి ద్వారానికి రెండువైపుల రుషభనాథ్, మహావీరుల మూడు ధ్యానాసన భంగిమ శిల్పాలున్నాయి. వాటితోపాటు ఆదిత్యుడు, ఏనుగు రెయింలింగ్, త్రిపురసంహారమూర్తి శిల్పశకలం వున్నాయి. దేవాలయ ద్వారబంధంలో ఉత్తరాశివరకు కట్ చేసి పెట్టినట్లుంది. దానిమీద పద్మపత్రాలు, లలాటబింబంగా జినుని శిల్పం, ఆ పైన గజలక్ష్మి, ఏనుగులపైన రెండువానరాలు, తోరణం పై అంతస్తులో విష్ణువు, ఆదిత్యుడు పరిచారకులతో అగుపిస్తున్నారు. పురావస్తుశాఖ అల్లాదుర్గం మోనోగ్రాఫ్లో ఈ గజలక్ష్మిఫలకం తవ్వకాలలో దొరికినట్లు రాసున్నది. ఆ గజలక్ష్మిని ఈ గుడిద్వారంపై అమర్చినట్లున్నారు. గజలక్ష్మి, కింద జినుని శిల్పం బైరాంపల్లి అంగడివీరన్నగుడి ద్వారబంధాన్ని పోలివుంది. గుడిలోపల మంటపంలో నందికందిగుడిలోని చిత్రకంఠస్తంభాలను పోలిన రాష్ట్రకూటశైలి స్తంభాలు వాటిపై శిల్పాలతో కనిపిస్తున్నాయి.
గుడిలో హనుమంతుని విగ్రహానికి కుడివైపు గూటిలో పాలరాతి సింహాసనం, మీద పాదాలు, వెనక గుండ్రని రాతిపలకమీద నాగరిలిపిలో మూడుపంక్తుల శాసనం వున్నాయి. సింహాసనం ముందుభాగాన అభిషేక జలాలు పోవడానికి సింహముఖప్రణాళి వుంది. ఇది జినుని పాదాల సింహాసనం. ఇంతకు మునుపు మరెక్కడా కనిపించని కొత్తశిల్పం. హనుమాన్ దేవాలయం ఒకప్పటి జినాలయమే. ఈ గుడి బద్దెగ లేదా కీర్తివిలాస శాంతిజినాలయాలలో ఒకటై వుంటుంది.
క్షేత్రసందర్శన, చారిత్రక కథనం: శ్రీరామోజు హరగోపాల్, మఠం వినోద్ కుమార్, సిరిపురం నరేందర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం-9949498698
అల్లాదుర్గంలో జినపాద సింహాసనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES