Sunday, June 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందాడులు కొనసాగితే టెహరాన్‌ను తగలబెడతాం

దాడులు కొనసాగితే టెహరాన్‌ను తగలబెడతాం

- Advertisement -

– ఇజ్రాయిల్‌ హెచ్చరిక
– ఇరాన్‌లో 20మంది చిన్నారులతో సహా 78మంది, ఇజ్రాయిల్‌లో నలుగురు మృతి
– ఆత్మాహుతి డ్రోన్లతో 150 లక్ష్యాలపై దాడులు చేశామన్న ఇరాన్‌
– ప్రత్యర్థికి సహకరిస్తే అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ స్థావరాలపైనా దాడులు చేస్తామని హెచ్చరిక
టెహరాన్‌, టెల్‌ అవీవ్‌ :
ఇజ్రాయిల్‌, ఇరాన్‌ పరస్పరం బీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా బీకర దాడులను మొదలుపెట్టిన ఇజ్రాయిల్‌ మధ్యప్రాచ్యంలో యుద్ధానికి తెరతీసింది. ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇజ్రాయిల్‌ దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్‌ ‘ఆపరేషన్‌ టూ ప్రామిస్‌ 3 కోడ్‌’ పేరిట ప్రతి దాడులతో విరుచుకుపడుతోంది. శనివారం ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించాయి. ఇరాన్‌ డ్రోన్లను, బాలిస్టిక్‌ క్షిపణులను వందలాదిగా ఇజ్రాయిల్‌ పైకి పంపింది. దీంతో జెరూసలేం, టెల్‌ అవీవ్‌లు వరుస దాడులతో కంపించాయి. ఆక్రమిత భూభాగాల్లో చొచ్చుకుపోయిన ఆర్ష్‌ తరగతి ఆత్మాహుతి డ్రోన్లు నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని ఇరాన్‌ ఆర్మీ ప్రకటించింది. తిబెరియాస్‌, ఆక్రమిత గోలన్‌, దిగువ గలీలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేసినట్టు పేర్కొంది. మొత్తంగా వ్యూహాత్మక మిలటరీ బేస్‌లు సహా 150 లక్ష్యాలపై దాడులు జరిగాయని బ్రిగేడియర్‌ జనరల్‌ అహ్మద్‌ వాహిది తెలిపారు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వ కమాండ్‌, కంట్రోల్‌ సెంటర్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సెంటర్‌లు వున్న నెవటిమ్‌, ఒవడా ఎయిర్‌ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నారు.
మరో ఇద్దరు సైనిక జనరల్స్‌ మృతి
ఇరాన్‌పై శనివారం జరిగిన దాడుల్లో ఇరాన్‌ సైనిక జనరల్స్‌ ఇద్దరు మరణించారు. బ్రిగేడియర్‌ జనరల్‌ ఘోల్‌మెర్జా మెహ్రబి, బ్రిగేడియర్‌ జనరల్‌ మెహిది రబ్బాని మరణించినట్లు ఇరాన్‌ సాయుధ బలగాల కమ్యూనికేషన్‌ సెంటర్‌ ప్రకటించింది.
ఇరాన్‌లో 78మంది, ఇజ్రాయిల్‌లో నలుగురు మృతి
ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 78మంది మరణించారని, వీరిలో 20మంది చిన్నారులు వున్నారని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్‌ రాయబారి తెలిపారు. 320మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. ఇరాన్‌ క్షిపణుల దాడుల్లో నలుగురు మరణించారని, ఏడుగురు సైనికులతో పాటు 70మంది గాయపడ్డారని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రతినిధి శనివారం చెప్పారు. సెంట్రల్‌ ఇజ్రాయిల్‌లో నివాస భవంతులపై పడిన క్షిపణులతో ఇద్దరు మరణించగా, 21మంది గాయపడ్డారని మీడియా తెలిపింది. టెల్‌అవీవ్‌ సమీపంలో ఈ దాడుల వల్ల జరిగిన నష్టం, విధ్వంసం దృశ్యాలను మీడియా ప్రచురించింది. అపార్ట్‌మెంట్‌లు పూర్తిగా ధ్వంసమై, అనేక వాహనాలు శిధిలాల్లో కూరుకుపోవడం కనిపిస్తోంది.
ఇరాన్‌ గగనతలం మూసివేత
దేశ గగనతలాన్ని మూసివేసినట్లు ఇరాన్‌పౌర విమానయాన శాఖ అధికారులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు దేశంలోని ఏ విమానాశ్రయంలోనూ విమానాలు నడవవని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యమని అధికార ఇర్నా వార్తా సంస్థ తెలిపింది. గతరాత్రి జరిగిన పరిమిత దాడులతో ఈ ఘర్షణలు ఆగిపోవని, ఇరాన్‌ దాడులు కొనసాగుతాయని మిలటరీ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ స్థావరాలపైనా దాడులు చేస్తాం : ఇరాన్‌
ఇజ్రాయిల్‌పై తమ దాడులను ఆపేందుకు ప్రయ త్నిస్తే, ఇజ్రాయిల్‌కు సహకరిస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.
టెహరాన్‌ను తగలబెడతాం : ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి
శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారు జామున జెరూసలేం గగన తలంలో పేలుళ్లు, సైరన్లు శబ్దాలతో ప్రజలకు తెల్లవారింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోనే వుండాలని, బయటకు ఎవరు రావద్దని ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్షిపణి దాడులు ఇలాగే కొనసాగితే టెహరాన్‌ను తగలబెడతామని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ హెచ్చరించారు. ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌తో సమావేశం అనంతరం రక్షణమంత్రి కట్జ్‌ మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ పౌరులకు కలిగిస్తున్న నష్టానికి ఇరాన్‌ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు.
దాడులకు ఇజ్రాయిల్‌ వైమానిక దళం సిద్ధం
టెహరాన్‌పై వైమానిక దాడులకు సిద్ధంగా వున్నామని ఇజ్రాయిల్‌ ఐడిఎఫ్‌ శనివారం ప్రకటించింది. శుక్రవారం నాటి దాడుల్లో ఇరాన్‌కు చెందిన తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మరణించారని, దీనివల్ల అణు బాంబు తయారీ సామర్ధ్యాలను సముపార్జించుకోవాలన్న ఇరాన్‌ ఆలోచనలకు ఎదురు దెబ్బ తగిలిందని మిలటరీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ సమాచారంతో కచ్చితమైన లక్ష్యాలపై దాడులు సాగించామని తెలిపింది.
గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్‌
ఐరాస తీర్మానానికి భారత్‌ దూరం
ఐక్యరాజ్యసమితి :
గాజాలో కాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ సహా 19 దేశాలు గైర్హాజరయ్యాయి. పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే, బేషరతుగా, శాశ్వతంగా నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్‌ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి 149 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఇజ్రాయిల్‌, అమెరికా సహా 12 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని తక్షణమే విడుదల చేయాలని తీర్మానం పునరుద్ఘాటించింది. గాజాకు అందుతున్న మానవతా సాయానికి అడ్డంకులు సృష్టించరాదని సూచించింది. యుద్ధ ఎత్తుగడల వ్యూహంలో భాగంగా గాజాలో ఆకలి కేకలను ఉపయోగించుకోవడాన్ని, సహాయాన్ని నిరాకరించడాన్ని తీర్మానం ఖండించింది. గాజా దిగ్బంధాన్ని ఇజ్రాయిల్‌ తక్షణమే తొలగించాలని, అన్ని సరిహద్దులనూ తెరిచి సహాయ సరఫరాలు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేసింది. తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించగా భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌ సమర్థించాయి. గాజాలో మృతుల సంఖ్య 55,000 దాటిన మరునాడే ఐరాసలో ఓటింగ్‌ జరిగింది. భూమిలో అత్యంత ఆకలితో బాధపడుతున్న ప్రాంతం గాజాయేనని ఐక్యరాజ్యసమితి గత నెలలో తెలిపింది.
ఇక అమెరికాతో అణు చర్చలు పనికిమాలిన పని : ఇరాన్‌ వ్యాఖ్యలు
దుబారు : తమ దేశంపై ఇజ్రాయిల్‌ దాడులకు తెగబడిన తర్వాత ఇక అమెరికాతో అణు చర్చలను కొనసాగించడం అర్ధరహితమని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘె శనివారం వ్యాఖ్యానించారు. ఆదివారం మస్కట్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి వుంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో బాఘె చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చలు సందేహంలో పడ్డాయి. చర్చలు జరపడాన్ని పనికిమాలిన అంశంగా అమెరికా మార్చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌ గీసిన లక్ష్మణ రేఖలన్నింటినీ ఇజ్రాయిల్‌ దాటేసిందని దాడులకు తెగబడడం ద్వారా క్రిమినల్‌ చర్యకు దిగిందని చెప్పారు. చర్చలు రద్దు అనే మాట ఉపయోగించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -