Monday, June 16, 2025
E-PAPER
Homeఆటలుట్రోఫీ ఆవిష్కరణ వాయిదా

ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా

- Advertisement -

– విమాన ప్రమాద మృతులకు సంతాపంగా నిర్ణయం
– పటౌడీ గౌరవార్థం విజేతకు ఓ మెడల్‌?
నవతెలంగాణ-లండన్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌కు టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేస్తూ ఇటీవల ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ట్రోఫీని ఇంగ్లాండ్‌లో పటౌటీ ట్రోఫీగా పిలిచేవారు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా (జూన్‌ 14న) టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీని ఆవిష్కరించేందుకు ఈసీబీ ఏర్పాట్లు చేసింది. సచిన్‌ టెండూల్కర్‌, జేమ్స్‌ అండర్సన్‌లకు ఆహ్వానం పంపటంతో పాటు లార్డ్స్‌లో అట్టహాసంగా కార్యక్రమ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. కానీ, అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం విషాదంతో ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. ‘భారత్‌లో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల గౌరవార్థం, సంతాపంగా ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా వేశామని’ ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు. ట్రోఫీ ఆవిష్కరణకు మరో ముహూర్తం ఖరారు చేస్తామని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టు ఆరంభానికి ముందు ట్రోఫీ ఆవిష్కరణ ఉండవచ్చని సదరు అధికారి వెల్లడించారు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన బోయింగ్‌ ఏఐ-171 విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
పటౌడీ వారసత్వం కొనసాగేలా! :
భారత్‌, ఇంగ్లాండ్‌ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ది టెండూల్కర్‌-అండర్సన్‌ పేరును ఎంచుకున్న ఈసీబీ, బీసీసీఐ.. భారత క్రికెట్‌ దిగ్గజం మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీకి గౌరవం ఇస్తూ, ఆయన వారసత్వం కొనసాగించేందుకు ఆలోచన చేస్తున్నాయి. పటౌడీ ట్రోఫీ పేరు మార్పు చేస్తున్నట్టు ఈసీబీ గతంలోనే పటౌడీ కుటుంబానికి (పటౌడీ కుమారుడు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌)కు తెలియజేసింది. క్రికెట్‌ లెజెండ్‌ పటౌడీ పేరిట ఉన్న ట్రోఫీని తొలగించటంపై సచిన్‌ టెండూల్కర్‌ తన అభ్యంతరాలను బీసీసీఐ, ఈసీబీకి తెలిపినట్టు సమాచారం. దీంతో పటౌడీ వారసత్వం కొనసాగించేలా భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో మరో మెడల్‌ను ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ చైర్మెన్‌ జై షా సైతం ఈ అంశంలో ఈసీబీతో మాట్లాడినట్టు తెలిసింది. టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పటౌడీ మెడల్‌ను సైతం ప్రకటించనున్నారు. ‘భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో పటౌడీ పేరును కొనసాగించేందుకు ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. చాంపియన్‌గా నిలిచిన జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను అందించబోతున్నామని’ ఈసీబీ అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -