Monday, June 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమీ 'స్కిల్‌'కు సహకరిస్తాం

మీ ‘స్కిల్‌’కు సహకరిస్తాం

- Advertisement -

– సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయండి
– సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన స్కిల్‌ యూనివర్సిటీకి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని కేంద్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి జయంత్‌ చౌదరి చెప్పారు. ఆదివారంనాడాయన జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని కేంద్రమంత్రికి వివరించారు. నిరుద్యోగులకు ప్రయివేటురంగంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్కిల్‌ యూనివర్సిటీ దోహదపడుతుందని తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా వివిధ ప్రయివేటు సంస్థలు ప్రమోట్‌ చేస్తున్న శిక్షణా తరగతులు, కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జయంత్‌ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్‌ రంగాలకు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఇది ఉపయోగంగా ఉంటుందనీ, ఐటీఐలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసి, దాన్ని ఐటీఐలకు అనుసంధానిస్తామని చెప్పారు. ఐటీఐల్లో సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్టు ఐటీఐల్లో సిలబస్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలనీ, దీనికోసం ప్రత్యేక కమిటీ నియమించాలని చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్‌ రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. సోమవారం జరగ నున్న కౌశల్‌మందన్‌ కార్యక్రమంలో హాజరయ్యేందుకు కేంద్రమంత్రి జయంత్‌ చౌదరి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎంను కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -