– గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు హైెదరాబాద్ యువకులు మృతి
నవతెలంగాణ-ముధోల్
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ నుంచి పుణ్య స్నానాల కోసం బాసరకు వచ్చిన ఐదుగురు యువకులు ఆదివారం గల్లంతై మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని చింతల్కు చెందిన 22 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు ఆదివారం బాసర సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. వారిలో ఐదుగురు యువకులు రాకేష్(17), వినోద్(18), రితిక్(18), భరత్, మదన్(17) గోదావరి నదిలో స్నానానికి వెళ్లగా నదిలో లోతైన ప్రాంతం గమనించకుండా వారు నీటిలో దిగి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల కండ్లముందే ఈ ఘటన జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఘటనా స్థలంలో యాత్రికులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన గజ ఈతగాళ్లతో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరొక యువకుని కోసం నదిలో గాలింపు చర్యల చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను ఆంబులెన్స్లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు నీటిలో నుంచి గజ ఈతగాళ్లు సహాయంతో మృతదేహాలను బయటకు తీయగా కుటుంబ సభ్యులు సీపీఆర్ చేసి బతికించుకోవడానికి కష్టపడుతున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఏదేమైనప్పటికీ వర్షాకాలం మొదట్లోనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల సందర్శకులను భయాందోళనలను గురిచేస్తున్నాయని యాత్రికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ఆ తల్లిరోదన పలువురిని కంటతడి పెట్టించింది.
బాసరలో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES