– పొగాకు ధరల పతనంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్
– ఉత్పత్తి తగ్గించాలని సూచన
– అంతకుముందు సిఎంతో భేటీ
అమరావతి : పొగాకు నిల్వలు పెరగడం వల్లే ఈ ఏడాది ధరలు తగ్గాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అయితే, వ్యాపారుల వద్ద నిల్వలు ఇంకా ఎందుకు ఉన్నాయో మంత్రి చెప్పలేదు. గుంటూరులోని పొగాకు బోర్డులో ఆదివారం సాయంత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి అధికారులతో సమావేశమైనారు. అంతకుముందు అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన సమావేశమైనారు. పొగాకు ధరలతో పాటు వివిధ అంశాలపై వీరు చర్చించారు. అనంతరం జరిగిన పొగాకు బోర్డు అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ధరల కోసం పొగాకు రైతులు చేస్తున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. గత నాలుగు సంవత్సరాలుగా రైతులకు మంచి ధరలే వచ్చాయని, ఈ ఏడాది వ్యాపారుల వద్ద నిల్వలు అధికంగా ఉండటంతో ఆ పరిస్తితి మారిందని చెప్పారు. పొగాకు ఉత్పత్తిని తగ్గించాలని, దీనిలో భాగంగా సాగు విస్తీర్ణాన్ని మరింత తగ్గించాలని సూచించారు. పెరడింగ్లో ఉన్న వర్జీనియా, నల్లబర్లీ పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
150 కోట్లు కేటాయించండి : సిఎం విజ్ఞప్తి
అంతకుముందు అమరావతిలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లకు 150 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుత సీజన్లో హెచ్డి బర్లీ, వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు ధరలు తగ్గిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని సిఎం ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రూ.300కోట్ల వ్యయంతో 20మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించందని చెప్పారు. . కొనుగోళ్ల కోసం రూ.150 కోట్లను టొబాకో బోర్డు ద్వారా వ్యయం చేసేలా చూడాలన్నారు. మ్యాంగో పల్ప్పై జిఎస్టి 12శాతం నుంచి 5శాతనికి తగ్గించాలని కోరారు. కూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా సిఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలతో రాష్ట్రంలోని 8లక్షల ఆక్వా రైతులు నష్టపోతున్నారని కేంద్రమంత్రికి సిఎంచంద్రబాబు తెలిపారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన 27శాతం సుంకాన్ని తగ్గించేలా ఆ దేశ అధికారులతో మాట్లాడాలని కోరారు.
సాగు విస్తీర్ణం పెరిగింది : విలేకరులతో కేంద్ర మంత్రి
టుబాకో బోర్డు సమావేశం ముగిసిన తరువాత గుంటూరులో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ విలేకరులతో మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పొగాకు సాగైందని తెలిపారు. మొత్తం 1.60 లక్షల మంది పొగాకు రైతుల పిల్లలకు విద్యారుణాలు ఇస్తామని, రూ.రెండు లక్షల నుంచి గరిష్ట పరిమితి రూ.ఐదు లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. రైతుల పిల్లలకు వివిధ అంశాలలో గురటూరులోని నేషనల్ డిజైన్ సెంటర్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పొగాకు రైతులకు విదేశీ భాషలను నేర్పేందుకు కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని, కృష్ణపట్నం ఓడరేవు అభివృద్దికి టెండర్లు పిలిచామని, త్వరలో ఖరారు అవుతాయని చెప్పారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తడ వద్ద ఉన్న శ్రీసిటీలో అనేక పరిశ్రమల ద్వారా వేలాది మంది ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి టి.జి.భరత్, ఎమ్మెల్యే జి.మాధవి, మేయర్ కె.రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల తదితరులు పాల్గొన్నారు.
నిల్వలే కారణమట!
- Advertisement -
- Advertisement -