నవతెలంగాణ-హైదరాబాద్ : ఫార్ములా ఈ-రేసు కేసులో నేడు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలోనే నందినగర్లోని నివాసంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను. 420 హామీలు, డిక్లరేషన్లపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటా. ఒకసారి కాదు.. వందసార్లు పిలిచినా విచారణకు వస్తా.. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు ఉంటుంది. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే లై డిటెక్టర్ టెస్ట్కు రావాలి’ అని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు.
‘మా మీద కేసులు బనాయించి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టినంతమాత్రాన భయపడుతామనుకుంటే.. అది మీ పిచ్చితనమే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టారు. నన్ను మళ్లీ మళ్లీ ఏసీబీ విచారణకు పిలుస్తున్నారు. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైళ్లు, కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తాం.
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోందని సంకేతాలు వస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వకుండానే హడావిడిగా ఎన్నికలు నిర్వహించే కుట్ర చేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీలు గమనించాలి. ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
దమ్ము ఉంటే లై డిటెక్టర్ టెస్ట్కు రావాలి : కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES