Tuesday, June 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజీడీపీ సంబరాలు - భారతీయుల వాస్తవ స్థితిగతులు

జీడీపీ సంబరాలు – భారతీయుల వాస్తవ స్థితిగతులు

- Advertisement -

భారతదేశం ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని నిటి ఆయోగ్‌ సీఈఓ ఘంటాపథంగా ప్రకటించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక గమనంపై వేసిన అంచనాల్లో భాగంగా 2025-26కు సంబంధించి ఇచ్చిన భవిష్యత్‌ చిత్రణను బట్టి ఈ మాట చెబుతున్నామని ఒప్పుకోవడం ద్వారా ఆయన కొంత నిజాయితీ చూపించారు. మరిన్ని వివరణలు వచ్చాక మనకు విషయమేంటో మరింత కచ్చితంగా అర్థమైంది. జపాన్‌ జీడీపీ 4,186.431 కోట్ల డాలర్లయితే దానికన్నా వెంట్రుక వాసి ఆధిక్యతతో భారతదేశ జీడీపీ 4,187.017 కోట్ల డాలర్లకు చేరిందని తేలింది. భారతీయుల తలసరి ఆదాయం డాలర్లలో చూస్తే జపాన్‌లో పదమూడవ వంతు మాత్రమే వుందనేది పూర్తిగా వేరే విషయం.
అందువల్లనే మోడీ సర్కారు ఆర్థిక నిపుణుల బృంద సమర్థకులు ఇంతగా ఉబ్బితబ్బిబ్బు కావడం. దాన్ని గోడీ మీడియా వంధిమాగధులు మరింత ఊదరగొట్టడం విడ్డూర మైన విషయం. వాస్తవానికి జీడీపీ స్థూల లెక్కలలోనే మునిగి తేలడం ఇక్కడ యాదృచ్ఛికమేమీ కాదు. ద్రవ్య పెట్టుబడి ఆదేశాలతో నడిచే నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ కొలబద్ద లక్షణమే అది. ప్రజల పరిస్థితులను, జీవనోపాధి తీరును వెల్లడించే దానికన్నా కప్పిపుచ్చడమే ఎక్కువ జరుగుతుంది. ఇది ప్రపంచమంతటా వున్న ధోరణే కానీ భారత దేశంలో మరీ ఎక్కువగా నడుస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలోనే అసమా నతలు అత్యధికంగా వుండే దేశంగా దాన్ని చూస్తున్నారు.
2022 ప్రపంచ అసమానతల నివేదిక లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో అత్యగ్ర భాగాన వున్న ఒక్క శాతం మంది 40 శాతం పైగా జాతీయ సంపదను కలిగివున్నారు. అట్టడుగున వుండే 50 శాతం మంది చేతిలో కేవలం 3 శాతం సంపద మాత్ర మే వుంది. బాగా పైనున్న పది శాతం మంది చేతుల్లో 57 శాతం జాతీయాదాయం వుండటంలోనూ ఇదే ఆర్థిక అసమానత మరీ ఘోరంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే స్థూల జీడీపీ లేదంటే తలసరి జీడీపీ లెక్క కూడా పక్కదోవ పట్టించేదే అవుతుం ది. కార్పొరేట్‌ మతతత్వ కూటమి సాగిస్తున్న క్రూరత్వం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఉద్దేశపూరకంగా కల్పించిన సృష్టి.
తెర వెనక వ్యూహమేంటి?
దీని వెనక వ్యూహం స్పష్టంగా బలంగా కనిపిస్తూనే వుంది. ‘బే జోక్యం (జోక్యం లేకుండా) అనే సైద్ధాంతిక తెర మాటున సామాజిక జీవితానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ ఆధిపత్య పథకాలను రుద్దడం కోసం రాజ్యం అధికారాన్ని పద్ధతి ప్రకారం ఉపయోగించు కుని దోపిడీ సామాజిక పెత్తనం సాగించడమే’ బ్రెజిల్‌ ప్రముఖ ఆర్థికవేత్త ఆల్ఫ్రెడో సాద్‌ఫిలో 2006 లోనే వివరించారు. ద్రవ్యచోదిత నయా ఉదార వ్యవస్థలో అదే జరుగుతుందని ఆయనన్నారు. ద్రవ్య మార్కెట్లు, అమెరికా పెట్టుబడి అంతర్జాతీయ ప్రయోజనాల హుకుంల దెబ్బకు పెట్టుబడి ప్రధాన పని సరుకులు సేవల ఉత్పత్తి కాకుండా పోయింది. దానికి మారుగా ఇప్పుడు పెట్టుబడి ప్రధానంగా స్పెక్యులేషన్‌ ద్రవ్య కార్యకలాపాల ద్వారా స్వల్పకాలిక సూపర్‌ లాభాల ఆర్జన కోసం ఉపయోగించ బడుతున్నది.
పెట్టుబడికి సంబంధించిన మూడు ప్రధాన వనరులు అంటే ప్రభుత్వ ద్రవ్యం, దేశీయ పొదుపు మొత్తం, దేశ విదేశీ పెట్టుబడుల అనుసంధానం అన్నవాటిపై అంతకంతకూ నియంత్రణ లేకుండా పోవడం, ఒక చోట పోగుపడటం పెరుగుతున్నది. ద్రవ్య పెట్టుబడి ఇందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నది. తమ దేశంలో ఉత్పాదక రంగ ఉద్యోగాలను పునరుద్ధరించుకోవడం కోసం ట్రంప్‌ ప్రభుత్వం బరితెగించి సాగించిన టారిఫ్‌ యుద్ధంలో ఈ తర్కమే కనిపించింది, విచిత్రమేమంటే అమెరికా సామ్రాజ్యవాదం ఆధ్వర్యంలోనే ద్రవ్య పెట్టుబడి ప్రపంచాధిపత్యం మొదట నెలకొన్నది.
అంతులేని అగాధం
ఈ శతాబ్ది ప్రారంభం నాటికి (అంటే 2000కు) ప్రపంచ విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) 400 లక్షల కోట్ల డాలర్లు వుండేవి. దాంతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 65 లక్షల కోట్లు డాలర్లు మాత్రమే వుండేవి. ఒక డాలరు ప్రత్యక్ష పెట్టుబడి అనుకుంటే స్టాక్‌లు, డెరివేటివ్‌ల వంటి స్పెకులేషన్‌ సాధనాల్లోకి ఏడు డాలర్లు తరలించబడేవి. పావు శతాబ్దం అంటే 25 ఏళ్ల తర్వాత ద్రవ్య పెట్టుబడి తాలూకూ ఈ ఆధిపత్యం మరింత పెరిగింది. స్పష్టంగా చెప్పాలంటే ఐఎంఎఫ్‌ చెబుతున్న ఈ భవిష్యత్‌ లెక్కల చిత్రణ సమకాలీన పెట్టుబడిదారీ వ్యవస్థ వివరాలను గానీ, శ్రామికవర్గంపై దాని వినాశకర ప్రభావాలను గానీ ఏ మాత్రం చెప్పజాలదు.
భారతదేశ జనాభాలో అత్యగ్రభాగాన వున్న ఒక్క శాతం మంది 40 శాతం పైగా జాతీయ సంపదను కలిగివున్నారు. అంటే 140 కోట్ల మందికి కేవలం వార్షిక తలసరి ఆదాయం సుమారు 1670 డాలరుల మాత్రమే. 62 శాతం జాతీయ సంపదను అదుపు చేస్తున్న అగ్ర భాగంలోని అయిదు శాతం మందిని పక్కన పెడితే అప్పుడు వార్షిక ఆదాయం లక్ష రూపాయలు మాత్రమే అవుతుంది. దేశ జనాభాలో అత్యధిక భాగం ఎదుర్కొంటున్న కఠోర వాస్తవ పరిస్థితులేమిటో ఇదే చెబుతుంది.
సాదాసీదా రంగాలకు చేటు
జీడీపీలో వివిధ రంగాల వారీ వాటాల మధ్య విపరీతమైన వ్యత్యాసాల కారణంగా ఈ అసమానతలు మరింత సంక్లిష్టమవుతున్నాయి. జీడీపీలో అధిక భాగం భారీగా పెట్టుబడులు అవసరమైన సేవల రంగం నుంచి, పెద్ద కార్పొరేట్‌ సంస్థలదే. మరోవైపున అసంఘటిత, యథాలాప రంగాలలోనూ వ్యవసాయంలోనూ నిమగమై వున్న శ్రామికులకు జీడీపీలో నామకార్థపు భాగమే వుంటోంది. ఫలితంగా నిరుద్యోగం పెరుగుదలకు తోడు నికరమైన ఆదాయాలు, జీవనోపాధి లోతైన సంక్షోభం ఎదుర్కొంటున్నాయి.
అంతర్జాతీయంగా చూస్తే ధనాఢ్య వర్గాలు పన్ను విధానాలను, నియంత్రణా వ్యవస్థలను, ప్రభుత్వ పెట్టుబడి నిర్ణయాలను చేజిక్కించుకుని. తమకు లాభదాయకంగా వుండేలా మలుచుకుం టున్నారు. భారత దేశంలో అయితే ఈ ప్రక్రియ మరింత తీవ్రంగా నడుస్తున్నది. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం విజృంభణకు తోడుగా కార్పొరేట్‌ ప్రయోజనాల ఉక్కుపట్టుతో ప్రజల ఆస్తులు, ప్రకతి వనరులు పథకం ప్రకారం ప్రైవేటు చేతుల్లోకి బదలాయింబడుతున్నాయి. కార్పొరేట్ల లాభాలు అపారంగా పెరిగిపోతుంటే జాతీయాదాయంలో శ్రామికుల వాటా తీవ్రంగా తగ్గిపోతున్నది. మన దేశంలో పరిస్థితి ప్రత్యేకించి ప్రమాదకరంగా వుంది. సాదాసీదా (ఇన్‌ఫార్మల్‌) ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు పెద్ద దెబ్బ కొట్టింది. కోవిడ్‌-19 తర్వాత ఈ పరిస్థితి ఇంకా దిగజారింది. ఇలాంటి వాతావరణంలో అదనపు ఉద్యోగాల కల్పనకు గానీ, స్థిరమైన ఆదా యాల కల్పనకు గానీ అవకాశం లేదు. జీడీపీ నామకార్థంగా పెరుగుదలలోనైనా జాతీయ సంపద లో భాగస్వామ్యం లేదు. పేద శ్రామికులు, నిరుద్యో గులే గాక మధ్య తరగతి వర్గీయులు కూడా మరింతగా దెబ్బ తింటున్నారు, వారు వెనకబడి పోవడమే కాదు, ఇంకా కిందకు దిగజారే ముప్పు కనిపిస్తున్నది.
ప్రజావసరాల నిర్లక్ష్యం
సంపద పున:పంపిణీ విధానాలు మగ్యం అయినప్పుడు సంపన్న వర్గాలు ప్రజా సేవల రంగాన్ని వదలిపెట్టి కేవలం ప్రత్యేకమైన ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్‌ ఆస్పత్రులు, గేటెడ్‌ కమ్యూనిటీలను ఎంచుకోగలవు. దాంతో ప్రజాసేవల వ్యవస్థ లపై పెట్టుబడులు పెట్టాలనే రాజకీయ సంకల్పం మరింత సన్నగిల్లిపోతుంది. కనీస పౌష్టికాహారం, గహ వసతి, ఆరోగ్య రక్షణ కోసం తంటాలు పడే 80 కోట్ల మంది భారతీయులకు జిడిపి ర్యాంకులు ఏ మాత్రం అక్కరకు వచ్చేవి కావు. కార్పొరేట్‌ మతతత్వ కూటమి విజృంభణ కేవలం యాదచ్ఛికంగా జరిగిందేమీ కాదు. అది ప్రజలను అస్తితత్వాల ప్రాతిపదికన విభజించి పాలనా వ్యవస్థ ప్రాబల్యం కొనసాగేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఉమ్మడిగా కలసికట్టుగా పోరాటాలు చేయడమే ముందుకు తీసుకు వెళ్లగల సరైన మార్గమవుతుంది.
(జూన్‌ 11 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -