Tuesday, June 17, 2025
E-PAPER
Homeఆటలుఅక్టోబర్‌ 5న భారత్‌, పాక్‌ ఢీ

అక్టోబర్‌ 5న భారత్‌, పాక్‌ ఢీ

- Advertisement -

– సెప్టెంబర్‌ 30న బెంగళూర్‌లో ఆరంభ పోరు
– ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌
నవతెలంగాణ-ముంబయి

అక్టోబర్‌ 5, ప్రేమదాస స్టేడియం, కొలంబో. భారత్‌, పాకిస్తాన్‌ మహిళల జట్లు తలపడేందుకు రంగం సిద్ధమైంది. సరిహద్దు ఉద్రిక్తతలకు ద్వైపాక్షిక సంబంధాల క్షీణత తోడవటంతో భారత్‌, పాకిస్తాన్‌లు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే పోటీపడుతున్నా… తటస్థ వేదికపైనే సమరానికి సై అంటున్నాయి. సెప్టెంబర్‌ 30న బెంగళూర్‌లో ఆరంభ మ్యాచ్‌తో షురూ కానున్న మెగా ఈవెంట్‌ నవంబర్‌ 2న ఫైనల్‌తో ముగియనుంది. ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ సోమవారం విడుదలైంది.
శ్రీలంకతో మొదలెట్టి..
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమ్‌ ఇండియా గ్రూప్‌ దశ మ్యాచులను శ్రీలంకతో మ్యాచ్‌తో మొదలెట్టనుంది. సెప్టెంబర్‌ 30న బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో టోర్నమెంట్‌ ఆరంభ వేడుకలు, తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఆతిథ్య భారత్‌, శ్రీలంక తొలి మ్యాచ్‌లో ఢకొీట్టనున్నాయి. అక్టోబర్‌ 5న భారత్‌ గ్రూప్‌ దశలో రెండో, కీలక మ్యాచ్‌ ఆడనుంది. కొలంబో వేదికగా పాకిస్తాన్‌ అమ్మాయిలతో టీమ్‌ ఇండియా పోటీపడనుంది. ఆ తర్వాత విశాఖపట్నంలో భారత్‌ వరుసగా రెండు మ్యాచులు ఆడునంది. అక్టోబర్‌ 9న దక్షిణాఫ్రికా, 12న ఆస్ట్రేలియాతో భారత్‌ మ్యాచులు వైజాగ్‌లో షెడ్యూల్‌ చేశారు. అక్టోబర్‌ 1న ఇండోర్‌లో ఇంగ్లాండ్‌తో, 23న గువహటిలో న్యూజిలాండ్‌తో, 26న బెంగళూర్‌లో బంగ్లాదేశ్‌తో భారత్‌ గ్రూప్‌ దశ మ్యాచులు ఆడనుంది. విశాఖపట్నంలో ఐదు మ్యాచులు జరుగనున్నాయి. బంగ్లాదేశ్‌ ఇక్కడ నాలుగు మ్యాచులు ఆడనుంది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంకతో మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌ వైజాగ్‌లోనే ఆడనుంది.
డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో పొరుగు దేశం న్యూజిలాండ్‌తో తలపడనుండగా.. గత సీజన్‌ ఫైనలిస్ట్‌లు ఆసీస్‌, ఇంగ్లాండ్‌లు అక్టోబర్‌ 22న ఇండోర్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. పాకిస్తాన్‌ మ్యాచులకు ఆతిథ్యం కోసం శ్రీలంకలోని కొలంబోను ఓ వేదికగా ఎంచుకోగా.. లంక అమ్మాయిలకు జాక్‌పాట్‌ తగిలింది. స్వదేశంలో ఆ జట్టు ఏకంగా ఐదు మ్యాచులు ఆడనుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో శ్రీలంక మ్యాచులు కొలంబోలోనే షెడ్యూల్‌ చేశారు. దీంతో కొలంబోలో ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఏకంగా 11 మ్యాచులు జరుగనున్నాయి. పాకిస్తాన్‌ సెమీఫైనల్‌, ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఓ సెమీస్‌, టైటిల్‌ పోరు సైతం అక్కడే జరుగనుంది.
హైబ్రిడ్‌ మోడల్‌లో..
2013 తర్వాత తొలిసారి భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఇదే. పొరుగు దేశం పాకిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలతో టోర్నమెంట్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం వహించగా.. భారత్‌ మ్యాచులను యుఏఈలో షెడ్యూల్‌ చేశారు. భారత్‌ ఫైనల్‌కు చేరవటంతో.. టైటిల్‌ పోరు సైతం పాక్‌కు ఆవలే జరిగింది. అదే తరహాలో మహిళల వరల్డ్‌కప్‌ను నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, భారత్‌ నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లు అర్హత టోర్నమెంట్‌ నుంచి చేరుకున్నాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఓ మ్యాచ్‌లో ఆడనుంది. గ్రూప్‌ దశలో టాప్‌-4లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -