Tuesday, June 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిబంధనలకు పాతర

నిబంధనలకు పాతర

- Advertisement -

– చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ ఇష్టారాజ్యం
– అనుమతులు గోరంత, నిర్మాణాలు కొండంత
– కేటాయించిన నీటి కంటె అధిక వినియోగం
– వేస్టేజ్‌ను శుద్ధి చేయడం లేదని ఆరోపణలు
– దుర్వాసన భరించ లేకపోతున్నాం…
– ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయండి
– ప్రభుత్వానికి చుట్టు పక్క గ్రామాల ప్రజల వినతి

ఇథనాల్‌ కంపెనీల లైసెన్స్‌. నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి నియంత్రణ లేక పోవడంతో అవి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తీసుకున్న అనుమతులకు, క్షేత్ర స్థాయిలో నిర్వహణకు పొంతన లేకుండా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో చిత్తనూర్‌లో ఏర్పాటు చేసిన ”జూరాల ఆర్గానిక్‌ పార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండిస్టీస్‌” సంస్థ ఒక్క్టటే ఉత్పత్తి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29 కంపెనీలు అనుమతి పొందగా, పదికి పైగా కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. భూ సేకరణ నుంచి మొదలుకుని నిర్మాణం, ఉత్పత్తి, నీటి వినియోగం, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్వహణ వరకు నిబంధనలను పాటించడం లేదు. కంపెనీల ఏర్పాటు తమకు మరణ శాసనాలుగా మారుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం ఇధనాల్‌ కంపెనీల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ఆహార ధాన్యాల దారి మళ్లింపు, నిబందనలకు విరుద్దంగా అధిక నీటి వినియోగం, వేస్టేజ్‌, మురుగు నీరు కోసం ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చెరకు, గోధుమలు. మొక్కజొన్న, మానవ వినియోగానికి పనికిరాని దెబ్బతిన్న ఆహార ధాన్యాలతో పాటు ఎఫ్‌సీఐలో మిగిలి పోయిన బియ్యంతో మాత్రమే ఇథనాల్‌ ఉత్పత్తి చేయాలని పేర్కొంది. గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 29 పరిశ్రమలకు కేంద్రం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసినా, నారాయణపేటలోని చిత్తనూర్‌లో ఒక ప్లాంట్‌ మాత్రమే గతేడాది ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే సదరు కంపెనీ నిర్వహణపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం మార్గదర్శకాలను కాలరాసి నేరుగా రైతుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే నీటి వినియోగంలోనూ కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిటి ఆయోగ్‌ లెక్కల ప్రకారం ఒక లీటర్‌ ఇథనాల్‌ తయారికి 4లీటర్ల నీటిని మాత్రమే వాడాలి. చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ వాస్తవంలో అంతకు రెట్టింపు నీటిని వాడుతున్నట్టు ఆరోపణలున్నాయి. కంపెనీ 6లక్షల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తికి అనుమతి తీసుకుని 4లక్షల లీటర్ల సామర్థ్యం గల కంపెనీని మాత్రమే నెలకొల్పింది. నడుస్తున్న సామర్థ్యం ప్రకారం రోజూ 1600 ఘనపు మీటర్ల నీటిని వాడాల్సి ఉండగా, 2,700 ఘనపు లీటర్ల నీటిని వాడుతున్నట్టు అధికారులు తేల్చారు. గతంలో నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కంపెనీ నుంచి ప్రతి రోజూ 13 లక్షల కిలోల వేస్టేజి వెలువడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. దాన్ని ట్రీట్‌ చేయకుండా ఫ్యాక్టరీ ఆవరణలో పెద్దపెద్ద గోతులు తవ్వి నిల్వ చేస్తున్నారనీ, ఫలితంగా భూగర్భ జలాలు కలుషితమవున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణను పాటించడం లేదని కంపెనీపై చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పలు మారు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో పాటు ఈ కంపెనీకి అనుమతులిచ్చిన ‘సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌’ విభాగానికి ఫిర్యాదు చేశారు. అయినా కంపెనీ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.
విధివిధానాలపై రాష్ట్రం కసరత్తు….
ఇథనాల్‌ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కొత్త అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇథనాల్‌ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ రైతు కమిషన్‌, పరిశ్రమల శాఖ అధికారులు సమవేశమయ్యారు. ”దేశంలోని అనేక రాష్ట్రాలు పరిశ్రమకు మద్దతుగా ఇథనాల్‌ విధానాలను ఇప్పటికే అమల్లోకి తెచ్చాయి. రాష్ట్రంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మూడేండ్లలో ఒక్క నారాయణపేటలోని చిత్తనూర్‌లో మాత్రమే ఒక ప్లాంట్‌ పనిచేస్తోంది. మక్తల్‌తో సహా నిర్మాణాన్ని ప్రారంభించిన కంపెనీలు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. భూసేకరణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణతో పాటు విద్యుత్‌, నీటి వినియోగం, నిర్మాణ అనుమతులను సులభతరం చేయాలి. ఇతర పరిశ్రమలకు ఇచ్చే అన్ని రకాల రాయితీలను అందించాలి” అని ఈ సందర్భంగా ఇథనాల్‌ కంపెనీల ప్రతనిధులు ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోలేమనీ, అయితే ఇథనాల్‌ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర స్థాయిలో కొన్ని నిబంధనలు రూపొందిస్తామని చెప్పినట్టు తెలిసింది.
అనుమతులు రద్దు చేయాలి
అలీసాబ్‌, ఎకలాస్‌ పూర్‌, మరికల్‌
పచ్చని పంట పొలాల నడుమ కాలుష్య చిచ్చు పెట్లే ఫ్యాక్టరీ వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అనేక మందిపై కేసులు పెట్టడంతో పాటు దాడులు చేశారు. ప్రజాభిప్రాయాన్ని కాదని ఫ్యాక్టరీ నిర్మించారు. గతేడాది నుంచి ఇక్కడ ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాల వల్ల వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వెంటనే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి.
వాసన భరించలేక పోతున్నాం : బండారు సత్తమ్మ, ఎకలాస్‌ పూర్‌, మరికల్‌
ఫ్యాక్టరీ నుంచి వెలువడే వాసన భరించ లేక పోతున్నాం. రాత్రయిందంటే మరీ ఎక్కువగా వస్తోంది. నీరు కూడా కలుషితమవుతోంది. నీటిని తాగడం వల్ల అనేక మందికి చర్మ, గొంతు, ఊపిరితిత్తుల వ్యాధుల భారిన పడుతున్నారు. ఇప్పటికైనా కంపెనీ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -