Wednesday, June 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసద్దాంకు పట్టిన గతే!

సద్దాంకు పట్టిన గతే!

- Advertisement -

– ఖోమైనికి ఇజ్రాయిల్‌ హెచ్చరిక
– పేలుళ్ళతో దద్దరిల్లిన టెహరాన్‌
– టెహరాన్‌ ఎయిర్‌పోర్టుపై దాడి, రెండు విమానాలు ధ్వంసం
– ఖోమైని కీలక సలహాదారు మృతి
– స్వరం మార్చిన ట్రంప్‌
– పూర్తిగా అణ్వాయుధాలను వదిలిపెట్టాలని డిమాండ్‌
టెల్‌ అవీవ్‌, టెహరాన్‌:
పేలుళ్ళతో టెహరాన్‌ నగరం మార్మోగిపోతోంది. సెంట్రల్‌, ఉత్తర టెహరాన్‌ల్లో రెండు భారీ పేలుళ్ళు జరిగిన శబ్దాలు వినిపించాయి. అయితే జరిగిన నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. ఇరాన్‌ మిలటరీ, అణు స్థావరాలే లక్ష్యంగా ఆకస్మికంగా దాడులు మొదలు పెట్టిన ఇజ్రాయిల్‌ ఐదు రోజుల నుంచి రాజధాని టెహరాన్‌పై దాడులను విస్తరిస్తూ వస్తోంది. పశ్చిమ ఇరాన్‌లో పలుచోట్ల యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. టెహరాన్‌ విమానాశ్రయమే లక్ష్యంగా దాడులకు దిగింది. అక్కడ గల రెండు ఎఫ్‌-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసమైన దృశ్యాలను ఐడీఎఫ్‌ విడుదల చేసింది. ఇరాక్‌ నేత సద్దాం హుస్సేన్‌కు ఎలాంటి గతి పట్టిందో ఇరాన్‌ గుర్తుంచుకోవాలని ఇరాన్‌ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేనిని హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ మిలటరీ, సెక్యూరిటీ సర్వీస్‌ కమాండర్లతో సమావేశం సందర్భంగా ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ కట్జ్‌ ఈ హెచ్చరిక చేశారు. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఇరాక్‌ నియంతకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో అదే ఇరాన్‌ నియంతకు కూడా ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు టెహరాన్‌ నగరాన్ని ఖాళీ చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రజలను కోరుతూ పోస్ట్‌ పెట్టారు. ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య దాడులు ముమ్మరమైన వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ పూర్తిగా అణ్వాయుధాలను వదిలిపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇరాన్‌ అణు సమస్యకు ‘వాస్తవమైన ముగింపు’ వుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య కాల్పుల విరమణను తాము కోరుకోవడం లేదని అన్నారు. ఇంతకుముందు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగాలని వ్యాఖ్యానించిన ట్రంప్‌ తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జరిగిన దాడుల్లో ఇరాన్‌ సీనియర్‌ సైనిక అధికారి, ఇరాన్‌ మత పెద్ద ఖోమైనికి కీలకమైన సన్నిహిత సలహాదారైన అలా షాద్మాని మరణించినట్టు ఇజ్రాయిల్‌ వర్గాలు తెలిపాయి. సెంట్రల్‌ టెహరాన్‌లోని ఒక రహస్థ స్థావరంలో దాగి ఉండగా సమాచారం తెలుసుకుని దాడి జరిపినట్టు పేర్కొన్నాయి. ఈ ఐదు రోజుల దాడుల్లో ఇరాన్‌ పలువురు కీలకమైన సైనికాధికారులను కోల్పోయింది.
మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్‌ దాడులు ఎఫ్‌-35 యుద్ధ విమానం కూల్చివేత టెల్‌ అవీవ్‌ నగరంపై క్షిపణులతో దాడులు
మరోవైపు ఇరాన్‌ కూడా ఇజ్రాయిల్‌ దాడులను దీటుగా ఎదుర్కొంటోంది. బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడుతోంది. మంగళవారం దాదాపు 20 క్షిపణులు టెల్‌ అవీవ్‌ నగరంపై పడ్డాయని ఇజ్రాయిల్‌ దళాలు వెల్లడించాయి. ఇజ్రాయిల్‌ గూఢచారి సంస్థ మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ మేరకు ఇరాన్‌ మీడియా పేర్కొంది. ఇజ్రాయిల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ భవన సముదాయంపైనా క్షిపణులతో దాడి చేసినట్లు మీడియా వెల్లడించింది. కచ్చితమైన సమాచారంతో ఇజ్రాయిల్‌ పక్కా లక్ష్యాలపై దాడులు చేయడానికి వెనుక వున్నది మొస్సాద్‌ గూఢచారి సంస్థేనని భావించిన ఇరాన్‌ ముందుగా ఆ సంస్థ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. తబ్రిజ్‌ నగరంలో ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్‌-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దీంతో ఇరాన్‌ ఇప్పటివరకు నాలుగు యుద్ధ విమానాలను కూల్చివేసిందని ఇరాన్‌ బలగాలు ప్రకటించాయి. తబ్రిజ్‌ చుట్టూ మూడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని, ఇజ్రాయిల్‌ నుండి వస్తున్న మైక్రో ఎయిర్‌ వెహికల్స్‌ (ఎంఎవి)లను విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపాయి.
ఇజ్రాయిల్‌కు బాసటగా నిలుస్తున్న జి-7
ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లకుండా చర్యలు తీసుకోవాలని జి-7 పిలుపివ్వడాన్ని ఇరాన్‌ తీవ్రంగా విమర్శించింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ముందస్తు దాడులకు దిగిన ఇజ్రాయిల్‌కు బాసటగా నిలుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించింది.ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘె ఒక ప్రకటన జారీ చేశారు. ఏకపక్ష వైఖరిని విడనాడి, ఉద్రిక్తతలు పెచ్చరిల్లడానికి మూల కారణం ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

ఆగ్నికి ఆజ్యం పోస్తున్న ట్రంప్‌ : చైనా
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ తీసుకుంటున్న మిలటరీ చర్యల పట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆకస్మికంగా ఇజ్రాయిల్‌ జరిపిన దాడులతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయన్నారు. కజకస్తాన్‌లో ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతలను దెబ్బతీసే ఏ చర్యనైనా చైనా వ్యతిరేకిస్తుందన్నారు. పైగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆజ్యం పోస్తున్నారని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు.

దౌత్యమే ఉత్తమం : ఈయూ
ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యమే ఉత్తమ మార్గమని యురోపియన్‌ యూనియన్‌ మంగళవారం వ్యాఖ్యానించింది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో 27 దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై అత్యవసర చర్చలు జరిపారు. అనంతరం ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ కజా కల్లాస్‌ మాట్లాడుతూ, ఉద్రిక్తతలు పెచ్చరిల్లకుండా చూడాల్సిన అవసరం వుందని అందరూ భావిస్తున్నారని చెప్పారు. అవసరమైతే ఈయూ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -