Wednesday, June 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటెహరాన్‌ను ఖాళీ చేయండి

టెహరాన్‌ను ఖాళీ చేయండి

- Advertisement -

– ఇరాన్‌ ప్రజలకు ట్రంప్‌ హెచ్చరిక
– జీ-7 సదస్సు నుంచి హుటాహుటిన వాషింగ్టన్‌ రాక
వాషింగ్టన్‌:
ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య మొదలైన ఘర్షణలు ఐదోరోజుకు చేరుకోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం హుటా హుటిన కెనడా నుంచి వాషింగ్టన్‌ తిరిగి వచ్చారు. జీ-7 సదస్సుకు హాజర య్యేందుకు కెనడా వెళ్లిన ట్రంప్‌ తన పర్యటనను కుదించుకొని ఒక రోజు ముందే స్వదేశానికి చేరుకున్నారు. ‘మధ్యప్రాచ్యంలో జరుగు తున్న పరిణామాల దృష్ట్యా ప్రపంచ నేతల సమావేశం నుంచి ట్రంప్‌ తిరిగి వచ్చారు’ అని శ్వేతసౌధం తెలిపింది. అధ్యక్ష భవనంలోని సిట్యుయేషన్‌ గదిలో సిద్ధంగా ఉండాలని ట్రంప్‌ తన జాతీయ భద్రతా బృందాన్ని ఆదేశించారంటూ వార్తలు వచ్చాయి. సంక్షోభాల సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్‌, జాతీయ భద్రతా బృందం ఈ గదిలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుంది.
‘కెనడా నుంచి నేను వాషింగ్టన్‌కు తిరిగి రావడానికి, కాల్పుల విరమణకు ఏం సంబంధం లేదు. దాని కంటే పెద్ద పనే ఉంది. వేచి చూడండి’ అని ట్రంప్‌ విలేకరులను ఊరిస్తూ చెప్పారు. ఇదిలావుండగా కెనడాలో ట్రంప్‌ ఇరాన్‌ ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ రాజధాని టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. అమెరికాతో అణు ఒప్పందంపై ఇరాన్‌ సంతకం చేసి ఉండాల్సిందని పునరుద్ఘాటించారు. ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ ‘అణు ఒప్పందంపై సంతకం చేయాలని నేను ఇరాన్‌కు చెప్పాను. వారు చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. సిగ్గుచేటు. ప్రాణనష్టం జరిగింది. ఇరాన్‌ వద్ద అణ్వాయుధం ఉండకూడదు. అంతా అయిపోయిందని నేను అంటున్నాను. ప్రతి ఒక్కరూ టెహరాన్‌ను ఖాళీ చేయాలి’ అని హెచ్చరించారు.
కాల్పుల విరమణ ప్రతిపాదనకు ‘నో’
ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ అవకాశాలను ట్రంప్‌ పరిశీలిస్తున్నారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తెలిపారు. ముందుగా కాల్పుల విరమణ పాటించి, ఆ తర్వాత రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలని ఆయన సూచించారు. అయితే కాల్పుల విరమణ ప్రతిపాదనను ట్రంప్‌ తోసిపుచ్చారు. మాక్రాన్‌పై ఆయన మండిపడుతూ ‘నేను కాల్పుల విరమణ కోసం కృషి చేసేందుకే జీ-7 సదస్సును వీడి వాషింగ్టన్‌ డీసీ వెళ్లానని మాక్రాన్‌ పొరబాటుగా చెప్పారు. అది తప్పు. నేను వాషింగ్టన్‌ ఎందుకు వచ్చానో ఆయనకు తెలియదు’ అని అన్నారు. కాగా ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నివారించాలంటూ జీ-7 దేశాల అధినేతలు రూపొందించే ముసాయిదా ప్రకటనపై ట్రంప్‌ సంతకం చేయబోరని అమెరికా అధికారి ఒకరు సోమవారం నాడే చెప్పారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ టెహ్రాన్‌తో అణు ఒప్పందం కుదుర్చు కోవాలని ట్రంప్‌ భావిస్తున్నారని అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సేథ్‌ తెలిపారు. మధ్యప్రాచ్యానికి అదనపు దళాలను తరలిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ సోమవారమే ఆగేయాసికాకు బయలు దేరింది. ఇజ్రాయిల్‌ సైనిక చర్యలో అమెరికా భాగస్వామి అవుతుందా కాదా అనే విషయంపై ట్రంప్‌ ఏమీ మాట్లాడడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -