Thursday, June 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్లపై గరంగరం

బనకచర్లపై గరంగరం

- Advertisement -

– వాడివేడిగా అఖిలపక్ష ఎంపీల భేటీ
– కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు
– తప్పుపట్టిన బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
– మీటింగ్‌ నుంచి వాకౌట్‌
– కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న బీజేపీ ఎంపీలు
– గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్న
– గైర్హాజరైన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు
– చంద్రబాబును ఎలా అడ్డుకోవాలో తెలుసన్న ముఖ్యమంత్రి
– మంత్రి ఉత్తమ్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశం వాడివేడిగా జరిగింది. ముఖ్య మంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా బనకచర్ల వల్ల రాష్ట్రానికి ఏర్పడే నష్టాన్ని వివ రించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లా డారు. మాజీ సీఎం కే చంద్రశేఖరరావు హయాం లోనే ఈ ప్రాజెక్ట్‌కు అంకురార్పణ జరిగిందన్నారు. ఈ వివాదానికి బీఆర్‌ఎస్‌పార్టీనే కారణమంటూ ఫైర్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్రంలో పలుకుబడి ఉన్నా, దాన్ని ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యా నించారు. సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ ప్రాజెక్ట్‌పై మాట్లాడతామని చెప్పి, రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని ప్రశ్నిం చారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం, ప్రభుత్వం చేపట్టాలను కుంటున్న చర్యల వరకే పరిమితం అయితే బాగుం టుందని సూచించారు. తమ నాయకుడు కేసీఆర్‌ పై ఆరోపణలు, నిందలు వేసి నందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్‌ చేస్తు న్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. బీజేపీ తరఫున ఆపార్టీ ఎంపీలు డీకే ఆరుణ, రఘునందన రావు హాజర య్యారు. రాష్ట్రానికి నష్టం జరిగితే ఊరుకోబోమనీ, సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టుల్ని సకాలంలో ఎందుకు పూర్తిచేయలేకపోయారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీటింగ్‌కు కాం గ్రెస్‌ ఎంపీలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజరు లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే వారిరువురూ గైర్హాజరయ్యారు.
కేసీఆరే కారణం : సీఎం
సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సచివాల యంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలోనే గోదావరి -బనకచర్లకు అంకురార్పణ జరిగిందన్నారు. 2019 అక్టోబరులో కేసీఆర్‌, జగన్‌ కలిసి గోదావరి జలాలను రాయల సీమకు తరలించడంపై చర్చించు కున్నారని తెలి పారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్‌ అన్నట్టు వారి సొంత పత్రిక లో రాశారని గుర్తుచేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీపడేది లేదన్నారు. బనకచర్ల వ్యవహారంపై ఏలా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించామన్నారు. తెలంగాణకు గోదా వరి, కృష్ణా నదులే జీవనాధారమనీ, రాష్ట్ర ప్రభుత్వా నికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. 2016, సెప్టెంబరు 21న కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించిందన్నారు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్నదని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. మూడు వేల టీఎంసీలు వృధాగా పోతున్నాయని మొదట మాట్లాడింది ఆయనేనని చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా రికార్డు రూపంలో ఉందనీ, రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని అప్పట్లో తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారని వివరిం చారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే సప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు. నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించు కుంటామనీ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకు నేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. గోదావరి బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని పోరాడుతామని తెలిపారు.తెలంగాణకు కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు సరిపోతాయని అప్పుడే కేసీఆర్‌ ఒప్పుకుని సంతకం చేశారని గుర్తు చేశారు. అప్పట్లో కేసీఆర్‌ చేసిన సంతకం ఈరోజు తెలంగా ణకు ప్రతిబంధకంగా మారిందని వివరించారు.
అలా చేస్తే అడ్డుచెప్పం: సీఎం
గోదావరి బేసీన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతున్నదని సీఎం రేవంత్‌ అన్నారు. గోదావరిలో హక్కుగా ఉన్న 968 టీఎంసీలు వినియోగించుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలన్నారు. కృష్ణాబేసిన్‌లో 500 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇస్తే ఏపీ బనకచర్లకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోమని వ్యాఖ్యానించారు. తమ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా మిగులు జలాలు ఉన్నాయని ఏపీ చెబుతున్నదన్నారు. కృష్ణాజలాల్లో పదేండ్లల్లో 299 టీఎంసీలు ఏనాడైనా వాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చేసిన ద్రోహంతో ఏపీకీ నీళ్లు వెళుతున్నాయని అన్నారు. ఐదు నెలలుగా తెలంగాణ అభ్యంతరాలతోనే బనకచర్ల అనుమతిపై కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. కేసీఆర్‌ చేసిన పాపంతో ప్రాజెక్టులు పూర్తికాలేదనీ, దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తిచేయకుండా కేసీఆర్‌ ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు అల్టిమేటం…
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ అల్టీమేటమ్‌ ఇచ్చారు. కేంద్రంలో పలుకుబడి ఉంది కదా అని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని అనుకోవద్దు..అది భ్రమే అవుతుంది. బనకచర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని సీఎం అన్నారు.తమ హక్కుల కోసం ఎక్కడా రాజీపడేది లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడతా మన్నారు. తమ హక్కులకు అడ్డువస్తే రాజ కీయంగా పోరాడుతామనీ, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మోడీకి చంద్రబాబు, చంద్రబాబు మోడీకి అవసరం ఉందన్నారు. ఇద్దరు పరస్పరం సహకరించుకుంటున్నారని గుర్తు చేశారు.
ఉత్తమ్‌ పీపీటీ
ఏపీ సర్కారు నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అఖిలపక్ష ఎంపీలకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘గోదావరి-బనకచర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరి-బనచర్యలపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పీజిబులిటీ నివేదిక సమర్పించింది’ అని వివరించారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి?
సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లే అవకాశముంది. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించ నున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేతలను సీఎం కలిసే వీలుంది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్‌ చైర్మెన్ల ఎంపికపై వారితో రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశముంది. మరోవైపు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్‌, ఇతర అధికారులను సీఎం కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -