– ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలపై స్టే
– తదుపరి విచారణ జులై 10కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్ఎస్ నేత దండె విఠల్ కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. తన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని ఈనెల 3న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే విఠల్ కు రూ. 50 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 13న దండె విఠల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని విఠల్ తరపు న్యాయవాది కోర్టు ను అభ్యర్థించారు. ఈ వాదనలపై ప్రతివాది పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కాగా పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే సుప్రీంకోర్టు వేసవి కాలం సెలవుల తరువాత ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కాగా, 2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా విఠల్ నామినేషన్ వేశారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. తాను నామినేషన్ ఉపసంహరించుకోకపోయినా, తన సంతకాన్ని దండె విఠల్ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, సంతకం ఫోర్జరీ జరిగిందన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్ ల్యాబోరేటరీకి ఇచ్చిన నివేదిక ఆధారంగా విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది.