సస్పెన్షన్‌ నీడలో ఐఓఏ

– డిసెంబర్‌ లోపు ఎన్నికలు పెట్టరడి
– అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ
న్యూఢిల్లీ : భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిషేధం నీడలో కొనసాగుతోంది!. డిసెంబర్‌ లోపు ఎన్నికలు నిర్వహించి, నూతన ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకోండి. లేదంటే జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఎన్‌) హోదా రద్దు, ఒలింపిక్‌ మూవ్‌మెంట్‌ కింద రావాల్సిన నిధులను నిలిపివేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) హెచ్చరించింది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) వ్యవహారాల పర్యవేక్షణకు ఢిల్లీ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించగా.. ఐఓసీ రూల్స్‌ను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసింది. తక్షణ నిషేధం ప్రమాదం నుంచి సుప్రీంకోర్టు కాపాడినా.. నిర్మాణాత్మక రీతిలో ఎన్నికలు జరిపేందుకు ఐఓఏ అధికారులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు. సెప్టెంబర్‌ 27న ఐఓసీ ప్రధాన కార్యాలయం లాసానెలో ఐఓఏ ప్రతినిధులతో ఐఓసీ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ భేటిలో ఐఓసీ స్పష్టమైన సందేశం ఇవ్వనుంది. ఐఓఏలో అంతర్గత కుమ్ములాటలు నిషేధానికి దారితీయకుండా, ఎన్నికలు నిర్వహించాలని ఐఓసీ హెచ్చరిస్తున్నప్పటికీ.. భారత ఒలింపిక్‌ సంఘంలో ఎటువంటి కదలిక కనిపించటం లేదు!.

Spread the love