నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలోని నిలంబూర్ ఉపఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి తనకు ఆహ్వానం అందలేదని, అందుకే పార్టీ అభ్యర్థుల తరుపున తాను ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పార్టీలో తన నిర్ణయాలపై, వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని, కాంగ్రెస్లో తనకు అందరూ మిత్రులేనని, నిలంబూర్లో జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు.
ఇటీవల ఆపరేషన్ సిందూర్, పాక్ పై దౌత్య యుద్దానికి ఏడుగురు ఎంపీలతో కూడిన అఖిల పక్ష బృందాన్ని బీజేపీ ప్రభుత్వం విదేశాలకు పంపిన విషయం తెలిసిందే. అయితే ఆయా పార్టీల నుంచి ఎంపీల పేర్లను పంపాలని బీజేపీ ప్రభుత్వం కోరగా.. కాంగ్రెస్ అందజేసిన జాబితాలో ఎంపీ శశి థరూర్ పేరు లేకున్నా..ఆయన నాయకత్వంలో ఓ బృందాన్ని యూఎస్ కు పంపించింది కేంద్రం ప్రభుత్వం. దీంతో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఖండించగా.. శశి థరూర్ మోడీ సర్కార్ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. దీంతో అపట్నుంచి శశి థరూర్కు, పార్టీకి మధ్య అంతరం పెరుగుతోంది. తాజాగా కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానానికి ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ప్రచారాలకు ఆయన దూరంగా ఉన్నారు.