– తెలంగాణ పౌర హక్కుల సంఘం నేత ప్రొ.జి.హరగోపాల్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ఒక బూటకమని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో గురువారం మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్తో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మావోయిస్టులను చంపేసి, ఎన్కౌంటర్ అంటూ కట్టు కథలు అల్లుతున్నాయని ఆరోపించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ భౌతిక పరిస్థితులను బట్టి చూస్తే సజీవంగా దొరికిన వారిని పట్టుకుని కాల్చి చంపినట్టుగా అర్థమవుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో కలిసి గ్రేహౌండ్స్ బలగాలను ఉపయోగించి ఎన్కౌంటర్లు చేస్తూ మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోతే ఆయన మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. శవాలపైనా కక్ష తీర్చుకోవడం బహుశా ప్రపంచ చరిత్రలో ఒక సీఎం ఒడిగట్టిన ఘటనగా మిగిలిపోతుందన్నారు. న్యాయ స్థానాలు వారికి పట్టనట్టుగా ఉండటం వల్ల ప్రభుత్వాలు ఇష్టారీతిగా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్నాయన్నారు. దండకారణ్యంలో ఇప్పటికి 550 మందిని చంపేశారని, అందులో మూడో వంతు ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. భూగర్భ వనరులను కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలనే లక్ష్యంతో అడ్డుపడిన వారిని విచక్షణారహితంగా చంపేస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఇప్పటికైనా చర్చలు జరపాలని కోరారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత మారేడుమిల్లి ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని, అందుకోసం పౌర సమాజాన్ని ఐక్యం చేస్తామని చెప్పారు.
మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES