Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన సుగుణమ్మ అంత్యక్రియలు

ముగిసిన సుగుణమ్మ అంత్యక్రియలు

- Advertisement -

– స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర
– నివాళ్లర్పించిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
– సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ సత్యం
నవతెలంగాణ-మియాపూర్‌

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శాఖమూరి సుగుణమ్మ(91) అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మహాప్రస్థానంలో గురువారం ముగిశాయి. ఆమె భౌతికకాయానికి సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు నివాళ్లు అర్పించారు. సుగుణమ్మ రెండు రోజుల క్రితం కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో కన్నుమూశారు. ఆమె భౌతికకయాన్ని ప్రజల సందర్శనార్థం సీఆర్‌ ఫౌండేషన్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంచారు. అనంతరం మియాపూర్‌లోని ప్రశాంత్‌నగర్‌ లోగల ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. ఆయా ప్రాంతాల్లో సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ సత్యంతోపాటు ఇతర నాయకులు సుగుణమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఇంటి నుంచి మహాప్రస్థానం వరకు అంతియ యాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘సుగుణమ్మకి జోహార్లు.. ఆమె ఆశయాలను కొనసాగిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. కళాకారులు పాటలు పాడారు. చివరగా రాయదుర్గం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీఐ ఇతర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో రైతుల, పేదవారి పక్షాన పోరాటం చేసిన యోధురాలు శాఖమూరి సుగుణమ్మ అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆమె జీవితాంతం పోరాటాలకే అంకితమయ్యారని తెలిపారు. ఆ రోజుల్లో మహిళలపై గ్రామాల్లో పెత్తందారులు చేసిన అనేక అరాచకాలకు వ్యతిరేకంగా మహిళలను కూడగట్టడంలో ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఒకవైపు రైతాంగ పోరాటంలో పాల్గొంటూనే.. మరోవైపు గ్రామాల్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాటం చేశారన్నారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. పాలక పార్టీలు పేదలపై అనేక భారాలను మోపుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ సుగుణమ్మ కన్న కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కమ్యూనిస్టు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కూతురు డాక్టర్‌ శోభ, కుమారులు శాఖమూరి రవి, శాఖమూరి రమేష్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు డీజీ నర్సింగరావు, సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరి, ప్రజాశక్తి పూర్వ ఎడిటర్‌ వినయకుమార్‌, సీపీఐ(ఎం) నాయకులు జి.రాములు, అరుణ జ్యోతి, ఇందిర, శోభన్‌, లక్ష్మమ్మ, నవతెలంగాణ మాజీ అసిస్టెంట్‌ ఎడిటర్‌ రాజకుమారి, సీపీఐ నాయకులు ప్రేమ్‌ పావని, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌, నాయకులు శ్యామల, సుకన్య, రమేష్‌, దశరథ్‌, రామకృష్ణ, చందుయాదవ్‌, వనం సుధాకర్‌ బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -