నవతెలంగాణ -హైదరాబాద్: ఈరోజు హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. టైగర్ కారిడర్ పేరుతో ఆదివాసీలు సాగుచేస్తున్న భూముల నుండి, వారు నివసిస్తున్న ప్రాంతాలనుండి దూరం చేసి కార్పొరేట్ కంపెనీలకు అడవులను కట్టబెట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోను తీసుకొచ్చింది. దీన్ని తక్షణమే రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానం షెడ్యూల్ ప్రాంతాల్లోని షెడ్యూల్ హక్కులను కాలరాసి అటవీ ఖనిజా సంపదలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పాజెప్పేందుకు ప్రయత్నిస్తున్నదని తమ్మినేని పేర్కొన్నారు. ఛత్తిస్ఘడ్ అటవీ ప్రాంతంలోని 4 లక్షల ఎకరాలను ఆదానికి అప్పజెప్పింది.
అటవీ ప్రాంతంలోని ఆదివాసీలను అక్కడి నుండి వెళ్లగొట్టి టైగర్ కారిడర్ల పేరుతో భూములను తీసుకొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు వస్తే, కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలిచ్చింది. మిగిలిన 8 లక్షల ఎకరాల సాగు భూమికి కూడా ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. సంవత్సరం దాటినా హామీ అమలు చేయలేదు. పైగా పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయించి, కేసులు పెడుతున్నది.
తక్షణమే ఇలాంటి దుర్మార్గాలను విడనాడి, మిగిలినవారికి కూడా పోడు హక్కు పత్రాలివ్వాలని, వారిపై అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహారించుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సౌకర్యాలు లేవు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్, ల్యాబ్ టెక్నీషన్, నర్సుల పోస్టులను భర్తీ చేయాలనీ తమ్మినేని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పి.ఆశయ్య, ఉడుత రవీందర్, పూసం సచిన్, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, కుంరం భీం జిల్లాల కార్యదర్శి కె రాజన్న, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, నాలుగు జిల్లాల పార్టీ కార్యకర్తలు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
