చెన్నై : తమిళనాడులో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ(ఎం) కార్యకర్తలపై సంఘ్ పరివార్కు చెందిన గూండాలు దాడి చేశారు. దిండిగల్ జిల్లా బర్దోర్న్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పరివార్ గూండాల దాడిలో సీపీఐ(ఎం) దిండిగల్ తాలూకా కార్యదర్శి శరత్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన పార్టీ కార్యకర్తలకు కూడా ఈ దాడిలో గాయాలయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 20 వరకూ సీపీఐ(ఎం) ఆధ్వర్యాన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బర్దోర్న్లో ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో సీపీఐ(ఎం) కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ గూండాలు దాడికి దిగారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) నాయకులు జాతీయ రహదారిని దిగ్భంధించారు.