– తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కవులు
– యువతరం అధ్యయనం చేయాల్సిన సాహితీవేత్తలు
– ఇరువురి శతజయంతి సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాలలో జాతీయ సదస్సు
– హాజరైన 30 డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘ఆ చల్లని సముద్ర గర్భం.. దాచిన బడబానల మెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో.. ఒక రాజును గెలిపించుటకై తెగిపడిన నరకంఠాలెన్నో..? అని ప్రశ్నించిన ప్రజాగొంతుక దాశరథి కృష్ణమాచార్య… ‘సంతకం అక్కరలేని కవి ఆరుద్ర.. అంత్యప్రాసలే ఆయన వాలుముద్ర..’ అంటూ భాగవతుల సదాశివ శంకరశాస్త్రి (ఆరుద్ర) ఔన్నత్యాన్ని చాటుతూ ఇరువురు కవుల శతజయంతి సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాలలో రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. 30 డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు సదస్సుకు హాజరయ్యారు. సదస్సును హైదరాబాద్లోని వీరనారి ఐలమ్మ మహిళా విశ్వవిద్యా లయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సూర్యాధనంజయ్ ప్రారంభించారు. కవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మేరునగధీరులు దాశరథి -ఆరుద్ర.. ఇరువురూ తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచారని చెప్పారు. తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నిలిచి.. అక్షరమే ఆయుధంగా పోరాడిన యోధుడిగా దాశరథి తిమిరంతో సమరం చేశారన్నారు. భూమి కోసం.. భుక్తి కోసం పోరాడుతున్న బడుగు వర్గాలకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడన్నారు. ఆరుద్ర గొప్ప పరిశోధకుడిగా సమగ్రాంధ్ర సాహిత్య పరిశోధనతో సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన అరుదైన మూర్తిగా కీర్తించారు. ఇద్దరూ ఈనాటి యువతరం అధ్యయనం చేయాల్సిన సాహితీవేత్తలని సూచించారు.
అక్షర యుద్ధం చేసిన కవులు
దాశరథి సాహిత్యంపై కీలకోపన్యాసం చేసిన ఉస్మా నియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ మాట్లాడుతూ.. తెలంగాణకు నిత్య ప్రాత్ణస్మరణీయులుగా నిలిచిన అగ్నిధార, కవితా పుష్పకం, తెలంగాణ అభ్యుదయ కవి దాశరథి అన్నారు. నిజాం రాజు మీద అక్షరం యుద్ధం చేసిన యోధుడన్నారు. దాశరధి-ఆరుద్ర తమదైన మార్గాల్లో సాహితీ ప్రయాణం చేసి ముందు తరాలకు సాహిత్య సంపదను కానుకగా ఇచ్చార న్నారు. ఇద్దరు కవులూ గొప్ప స్నేహితులని ఆరుద్రపై కీలకోపన్యాసం చేసిన ప్రముఖ సాహిత్య విమర్శకులు కవి, రెంటాల శ్రీవేంకటేశ్వరరావు అన్నారు. ఆరుద్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ”తెలంగాణ ”త్వమేవాహం” వంటి కావ్యాలు రాశారన్నారు. ఆరుద్ర విజ్ఞానం వివేచన కలిగి జిజ్ఞాసే జీవన లక్షణంగా బతికారని అభివర్ణించారు.
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఏఎల్ఎన్.శాస్త్రి అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సదస్సులో కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బన్న ఐలయ్య, కె.యు.పాలక మండలి సభ్యులు డా.చిర్రారాజు, కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు రవిమారుత్, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్, వైస్ ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, ఐ.క్యూ,ఏ.సి కోఆర్డినేటర్ డా.సునంద మాట్లాడారు. సదస్సు కన్వీనర్ తెలుగు విభాగాధిపతి డా.పి.రవికుమార్ సదస్సు లక్ష్య ప్రకటన చేశారు. తొలుత కాళోజీ అవార్డు గ్రహీత సీనియర్ అధ్యాపకులు డా.సీతారాం స్వాగతోపన్యాసం చేశారు. సదస్సులో భాగంగా వివిధ ప్రాంతాల విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, రెండు రాష్ట్రాల నుంచి పాల్గొన్న డిగ్రీ కళాశాలల అధ్యాపకులు 30మంది పత్ర సమర్పణలు చేశారు. కళాశాల తెలుగు అధ్యాపకులు డా.జె.అనురాధ, కిరణ్కుమార్, డా.ఎం.వి.రమణ, డా.కార్తీక్, కోటమ్మ, శ్రీనివాస్ వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.