Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయంముంబయి పోర్ట్‌ డ్రెడ్జింగ్‌ పనుల్లో అవినీతి

ముంబయి పోర్ట్‌ డ్రెడ్జింగ్‌ పనుల్లో అవినీతి

- Advertisement -

టాటా గ్రూప్‌ కంపెనీపై సీబీఐ కేసు
మరి కొందరు వ్యక్తులు, సంస్థలపై కూడా…
రూ.800 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ
న్యూఢిల్లీ :
ముంబయిలోని జవహల్‌లాల్‌ నెహ్రూ పోర్టుకు సంబంధించిన క్యాపిటల్‌ డ్రెడ్జింగ్‌ (తవ్వకాలు) ప్రాజెక్టులో రూ.800 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణల పై టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (టీసీఈ) కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనితో పాటు జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ అథారిటీ (జేఎన్‌పీఏ) మాజీ చీఫ్‌ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ సహా పలువురు వ్యక్తులు, సంస్థలపై కూడా కేసు పెట్టింది. ఓడరేవులో డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టినప్పుడు టీసీఈ కంపెనీ ముంబయి ఓడరేవు అధికారులతో కుమ్మక్కై కుట్ర పన్నిందని, కొన్ని ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించిం దని సీబీఐ ఆరోపించింది. ముంబయి పోర్టులో రెండు దశలుగా డ్రెడ్జింగ్‌ పనులు నిర్వహించారు. మొదటి దశను 2010-2014, రెండో దశను 2012-2019లో పూర్తి చేశారు. డ్రెడ్జింగ్‌ పనులలో అవినీతిపై మూడు సంవత్సరాల పాటు ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ…ప్రాజెక్ట్‌ వ్యయ అంచనాల ను భారీగా పెంచారని, అంతర్జాతీయ బిడ్డర్లకు అనుకూలంగా వ్యవహరించారని, కాంట్రాక్టర్లకు అవాంఛిత ప్రయోజనాలు చేకూర్చారని, స్వతంత్ర నిపుణుల నివేదికను తొక్కి పెట్టారని గుర్తించింది. జేఎన్‌పీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ సునీల్‌ కుమార్‌, టీసీఈ మాజీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దేవ్‌దత్‌ బోస్‌, గ్లోబల్‌ మారీటైమ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ బాస్కలిస్‌ స్మిత్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ, జన్‌ దే నల్‌ డ్రెడ్జింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు కొందరు ప్రభుత్వోద్యోగులపై ఐపీసీలోని 120-బీ (క్రిమినల్‌ కుట్ర), 420 (మోసం) సెక్షన్లు సహా అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసులు నమోదు చేసింది. సీబీఐ అధికారులు బుధవారం ముంబయి, చెన్నైలోని ఐదు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. క్యాపిటల్‌ డ్రెడ్జింగ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు, ప్రభుత్వోద్యోగుల పెట్టుబడుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జేఎన్‌పీటీ, టీసీఈ ఎగ్జిక్యూటివ్స్‌తో పాటు ప్రైవేటు వ్యక్తులు కుట్రకు పాల్పడడంతో డ్రెడ్జింగ్‌ మొదటి దశకు రూ.365.90 కోట్లు, రెండో దశకు రూ.438 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ విచారణ నిర్ధారించింది. డ్రెడ్జింగ్‌ పనులకు సంబంధించిన ధరలను నిర్ణయించడంలో నిబంధనలను ఉల్లంఘించారని కూడా తేల్చింది. ప్రాజెక్టును పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని, కాంట్రాక్టర్లు రూ.348 కోట్ల మేర తప్పుడు బిల్లులు సమర్పించారని, రూ.430 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయని, తక్కువ కచ్చితత్వం కలిగిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డ్రెడ్జింగ్‌కు ముందు జరిపిన సర్వేలను తారుమారు చేశారని కూడా సీబీఐ తెలిపింది. నిందితుల నుండి సీబీఐ స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలన కొనసాగుతోంది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు ఇంకా వాటిపై స్పందించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -