విద్యా నాణ్యత పెంపు కోసం చర్యలు
24,146 స్కూళ్లలో తనిఖీలు
ప్రత్యేకంగా ఉపాధ్యాయుల నియామకం
విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. విద్యా నాణ్యతను పెంచడం కోసం పాఠశాలలపై పర్యవేక్షణను మెరుగుపర్చడంపై దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24,146 ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ శనివారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రతి విద్యా సంవత్సరం కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. తనిఖీల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమిస్తామని వివరించారు. రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో రెండు శాతం మంది టీచర్లు తనిఖీ, పర్యవేక్షణ కోసం నియమిస్తామని పేర్కొన్నారు. వారిని పూర్తిస్థాయి తనిఖీ అధికా రులుగా పరిగణిస్తామని తెలిపారు. కనీసం పదేండ్ల అనుభవం, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని నియమిస్తామని పేర్కొన్నారు. వారికి శిక్షణ, టెక్నాలజీ పరిజ్ఞానం ఉండాలనీ, శిక్షణ ఫలితాలపై దృష్టి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని సూచించారు. పాఠ్యాంశాలు, బోధన ప్రణాళికలను పరిశీలించాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులు గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, సహపాఠ్య కార్యకలాపాలను చూడాలని తెలిపారు. క్రీడలు, డిజిటల్ విద్య, విద్యార్థుల ఆరోగ్యాన్ని తనిఖీ చేయాల్సి ఉంటుందని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీగోద, విద్యుత్, ఆడిటోరియం, క్రీడాస్థలం ఉన్నాయా? లేదా అనేది పరిశీలించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు అందుతున్న తీరు గురించి తెలుసుకోవాలని కోరారు. ఫలితాలు, పాఠ్య ప్రణాళికల అమలుపై పరిశీలించాలని తెలిపారు. రోజుకు రెండు ప్రాథమిక పాఠశాలల చొప్పున, త్రైమాసికానికి 100 పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. రోజుకు ఒక ఉన్నత పాఠశాల చొప్పున త్రైమాసికానికి 50 పాఠశాలలకు వెళ్లాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీని నియమించాలని తెలిపారు. త్రైమాసిక, వార్షిక పర్యటన ప్రణాళికలు ఆమోదం కోసం సమర్పించాలని పేర్కొన్నారు. పరిశీలన నివేదికలు ప్రతినెల ఐదో తేదీలోగా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఆకస్మిక తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష నిధుల నుంచి ప్రయాణ భత్యం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లో పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన చెక్ లిస్టు ఆధారంగా చూడాలని పేర్కొన్నారు.
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES