Monday, June 23, 2025
E-PAPER
Homeదర్వాజ'ఆఖరి పేజీ'లో ఆఖరి మాటలు

‘ఆఖరి పేజీ’లో ఆఖరి మాటలు

- Advertisement -

‘ఆమె’, ‘వారణాసి యాత్రా కథనం’ వంటి రచనలతో తనదైన ముద్ర వేసుకున్న యువ రచయిత వినోద్‌ మామిడాల కలం నుండి వెలువడిన మరో అక్షరధార ‘ఆఖరి పేజీ’. మంచుతెరల చాటున కనబడీ కనబడనట్టున్న నిజజీవితాలను వెలికితీయటం ఈ రచనలలో ప్రత్యేకత. ప్రతి ముగింపు సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా వుండి చివరి వరకు చదివిస్తుంది. వినోద్‌ మామిడాల తన పుస్తకం తొలి పేజీలలోనే ”ఈ ఆఖరి పేజీలో ఆత్మ పరిశీలన, ఆవేదన, దు:ఖం, వీరత్వం, త్యాగం, నిస్సహాయత, స్వేచ్ఛ, ఆనందం ఉంటాయి” అన్నారు. నిజంగానే వైవిధ్య భరితమైన జీవిత చిత్రాల ఎంపిక! ”రాజ భోగాలతో జీవితాన్ని మొదలెట్టినవారు ఒంటరిగా ముగించారు. కొందరు ఒంటరిగా మొదలై ప్రజల గుండెల్లో స్థానం సంపాదించార”న్నారు. ”అంతిమయాత్ర ఎలా ఉంటుందో తెలిస్తే జీవనయాత్ర ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు” అన్న భావగర్భితమైన మామిడాల మనోగతం స్పష్టంగా ఆవిష్కరించారు. భార్య, భర్త, అమ్మ, నాన్నలతో కూడిన చిన్న కుటుంబంలో విరబూసిన ప్రేమ, జన జీవన కుటుంబంలో అడుగుపెట్టి, ఆ ప్రజల కోసం వికసించి, విశాల ప్రపంచానికి వెలుగులు విరజిమ్మిన కొన్ని జీవితాల ఆదర్శాన్ని నేటి తరానికి వినూత్నంగా అందించిన రచన ‘ఆఖరి పేజి’.
భాషా ప్రయోగం, భావ వ్యక్తీకరణ కూడా ప్రత్యేకం. అది వినోద్‌ మామిడాల శైలి. పాండిత్య ప్రదర్శన జోలికి పోలేదు. ఎంపిక చేసుకున్న ప్రతి జీవన యానంలో ఆఖరి పేజీ గురించి రాయడంతో ఆగలేదు. ప్రతి ఆఖరి పేజీలోనూ ఆఖరి మాటకు ప్రత్యేకత ఉన్నది. ”ఒక సాహసీకుడి జీవన యాత్ర అంతమైంది. కానీ, అతని సముద్రయానం ఇంకా ముగియలేదు”. సముద్రపు ఒడ్డునే తుదిశ్వాస విడిచిన వాస్కోడీగామ గురించి రాసిన వాక్యమిది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు విన్సెంట్‌ వ్యాంగో జీవిత కథకు సరైన శీర్షిక ”మరణం తరువాత వెలుగు” ఇందులో కూడా భావవ్యక్తీకరణ ప్రత్యేకం. బ్రతికున్న కాలంలో బాహ్య ప్రపంచానికి తెలియని విన్సెంట్‌ వ్యాంగో మరణానంతరం ఆయన చిత్రాల వెలుగులో వికసించారు. ప్రముఖ రష్యన్‌ రచయిత దోస్తోవ్‌ స్కీ జీవితానికి ఇచ్చిన శీర్షిక ”నవలలాంటి జీవితం-ఆఖరి పేజీ విషాదం” కూడా ఇలాంటిదే. ”చావుకే సవాళ్ళు విసిరిన శాస్త్రవేత్త” స్టీఫెన్‌ హాకింగ్‌ జీవన సమరానికి సరైన శీర్షిక. బహుశా ఈ రచయిత పాత్రికేయుడు కూడా కాబట్టి ఇలాంటి శీర్షికలు పెట్టగలిగారేమో! ”ఖగోళశాస్త్రవేత్త గెలీలియో మరణించిన జనవరి 8న హాకింగ్‌ జన్మించటం, ఐన్‌స్టీన్‌ జన్మించిన మార్చి 14న హాకింగ్‌ మరణించడం చరిత్రలో ఊహించని యాధృచ్ఛికం”. ఈ యాధృచ్ఛిక ఘటనలను ‘ఆఖరి పేజీ’ లలో మన ముందుంచటం మాత్రం యాధృచ్ఛికం కాదు.
భావవ్యక్తీకరణ తీరు ప్రముఖుల జీవిత సందేశాలను చదువరులకు హత్తుకునే విధంగా బలం చేకూర్చింది. భాషా సంద్రంలో సందేశాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడా రాలేదు. శ్వేతజాతి దురహంకారం మీద పోరాటానికి సరైన వ్యక్తీకరణ, నెల్సన్‌ మండేలా జీవితానికి సరైన శీర్షిక ”చీకటి ఖండపు వెలుగు శిఖరం నెల్సన్‌ మండేలా” సందేశంతో మేళవించిన పదబంధం చూడవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ గురించి రాసిన ఒక భాగం కూడా చూడండి. ”అసలు దేవుడు లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. అద్భుతమైన ఈ విశ్వ రహస్యాలు తెలుసుకోవాలంటే మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే, అని ఎంతో బలంగా చెప్పిన స్టీఫెన్‌ హాకింగ్‌, ఆ ఒక్క జీవితం కూడా వీల్‌ ఛైర్‌లోనే గడుపుతూ పరిశోధనలు కొనసాగించవలసి వచ్చింది. నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో కూలబడిపోవచ్చు. కానీ, నా మెదడు విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్నాడు”. ఇక్కడ హాకింగ్‌ మాటలను ఎంపిక చేసుకొని చదువరుల ముందుంచిన తీరు గమనించదగింది.
కొందరు ప్రముఖుల ఆఖరి పేజీలోని ఆఖరి మాట భవిష్యత్‌ తరాలకు దిక్సూచి. అబ్దుల్‌కలాం గురించి చెప్పిన ఆఖరి మాటలు ”నాకోసం అంతగా కష్టపడినందుకు మీకు ధన్యవాదాలు. నావల్ల మీరు యిబ్బంది పడినందుకు క్షమించండి”. రాష్ట్రపతి హౌదాలో ఆయన ప్రయాణం సందర్భంగా, ఆయన వాహనానికి ముందు మరొక వాహనంలో రెండు గంటలపాటు నిలబడిన భద్రతా సిబ్బందితో మాజీ రాష్ట్రపతి పలికిన మాటలివి. మానవత్వం ముందు అధికార దర్పం ఓడిన సందర్భమది. మండేలా గురించిన కథనంలో ఆఖరి మాట ”సమాజంలో ఎవరూ మరొకరిని దోపిడీ చేయొద్దు, అణిచివేయొద్దు”. హాలీవుడ్‌ హీరో మరణం గురించి చెప్పిన ఆఖరి మాటలకు ప్రత్యేకత ఉన్నది. ”పాల్‌వాకర్‌ చనిపోయినప్పుడు ఆయనను హాలీవుడ్‌ హీరోగానే అందరూ అనుకున్నారు. కానీ, అతను నిజజీవితంలో కూడా హీరోనే అని చాలా తక్కువమందికే తెలుసు”. ‘రీచౌట్‌ వరల్డ్‌ వైడ్‌’ అనే చారిటీ సంస్థ ఆధ్వర్యంలో బాధితులను ఆదుకునేందుకు కృషి చేశారు. ఇక్కడ పాల్‌వాకర్‌ సేవాతత్పరతను రచయిత వెలుగులోకి తెచ్చారు. సవితా హలప్పనవార్‌ జీవితపు కథనం చివరిపేజీలో ఆఖరి మాట ప్రజా ఉద్యమం ఫలితంగా సాధించిన ”అమ్మతనంపై హక్కు అమ్మకే ఉంటుంది”. ఇటలీ నియంత ముస్పోలిని ఆఖరిపేజీలోని ఆఖరి మాటలు మరువరానివి. ”చరిత్రలో ముస్సోలిని పేజి ముగిసింది. ప్రజలకు స్వేచ్ఛ దొరికింది”. ”నియంతల మరణం ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి రక్ష”. షోయబుల్లాఖాన్‌ జీవన చిత్రంలోని ఆఖరి మాటలు ”నియంతృత్వానిది పరాకాష్ఠ అయితే, ప్రశ్నించే గొంతులదే గొడవంతా… అన్యాయానిదే అధికారమైతే, ఎదిరించే కలాలదే వేదనంతా”. హిట్లర్‌ ఫాసిజం మీద పోరాడి తనువు చాలించిన యోధులు జులియస్‌ ఫ్యూజిక్‌, అగస్తినాల గురించి రాసిన ఆఖరి వాక్యాలు హృదయాలను కదిలించివేస్తాయి. జులియస్‌ ఫ్యూజిక్‌ ఎదురుగా ఆయన భార్య అగస్తినాను నిలబెట్టి, వారిని లొంగదీసుకునేందుకు బెదిరిస్తున్న హిట్లర్‌ సైనిక మూకలతో అగస్తినా చెప్పిన మాటలు జులియస్‌ ఫ్యూజిక్‌ను మరింత ధైర్యంగా కర్తవ్యోన్ముఖుణ్ణి చేసాయి.
క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్‌ కాస్ట్రో చివరి పేజీలో గుర్తుచేసిన కాస్ట్రో మాటలు మరువలేనివి. విక్టర్‌ జారా చివరి పేజీలో రచయిత చెప్పిన చివరి మాటలు చూడండి. ”విక్టర్‌ శరీరం నేలపై పడింది ఒక చిలీ గాయకుడి ప్రాణం ఫాసిజపు కోరలకు బలైంది. కానీ, అతని గొంతు ఆగలేదు. అది ఖైదీల హృదయాలలో, చిలీ ప్రజల జీవితాలలో పాడుతూనే ఉన్నది.” ఈ త్యాగాల ఫలితమే కదా యాభై యేండ్ల తరువాత చిలీ చరిత్ర మరోసారి తిరగబడింది. మళ్ళీ అరుణకాంతులు వెదజల్లుతున్నది.
ప్రధాని పదవిని సైతం తృణప్రాయంగా తిరస్కరించిన మహానేత జ్యోతిబసు కమ్యూనిస్టు క్రమశిక్షణను రచయిత గుర్తుచేశారు. ప్రపంచ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ‘మొనాలిసా’ కళా ఖండం సృష్టికర్త లియోనార్డో డావిన్సి గురించి ప్రపంచానికి తెలియని విషయాలు తెలియజేశారు. నిత్యం మన పెదవుల మీద కదలాడుతున్న తురుం ఖాన్‌ నేపథ్యం, తుర్రేబాజ్‌ ఖాన్‌ వీరమరణం గురించిన విషయాలూ చెప్పారు. మానవాళి జీవితాలతో చెలగాటమాడిన ఉగ్రవాది ఓసామాబిన్‌ లాడెన్‌ చివరిఘడియలను కూడా రచయిత వదిలిపెట్టలేదు. అదేసమయంలో, కొన్ని చారిత్రక వాస్తవాలు సరిగ్గా సరిచూసుకొని ఉండాల్సింది. జ్యోతిబసు ప్రధాని పదవిని తిరస్కరించటం పొరపాటని ఆ పార్టీ ఎప్పుడూ భావించలేదు. తెలంగాణలో స్వేచ్ఛ కోసం నిజాం పాలనలో షోయబుల్లా ఖాన్‌ ఆఖరి అమరుడు కాదు. ఆయన రచనలు నిజాం రాచరికపు అణిచివేతలకు వ్యతిరేకంగా సాగాయి. హైదరాబాదు రాజ్యంలో సాగింది స్వాతంత్య్ర పోరాటం కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుండి విముక్తి కోసం, రాచరికపు అంతం కోసం సాగిన పోరాటం. ఈ పోరాటానికి వ్యతిరేకంగా రజాకార్‌ మూకలను ప్రయోగించిన రాజుతోపాటు నాటి ప్రధాని మీర్‌ లాయక్‌ అలీ కూడా నేరస్తుడే. భావాలు బలంగా వ్యక్తం చేసినప్పుడు వాటి ప్రభావం కూడా ఎక్కువ. కొత్తతరానికి చారిత్రక సత్యాలే అందాలి. పాలకులే చరిత్రను వక్రీకరిస్తున్న కాలంలో చారిత్రక అంశాలు చెప్పేటప్పుడు రచయితలు మరింత జాగ్రత్త వహించటం అవసరం. ‘సముద్రాలను దాటిన దైవదూత ‘ ఎందుకు ఎంపిక చేసుకున్నారో తెలియదు. ఈ కూర్పులో అది ఇమడలేదనిపించింది.
రచయిత తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. ఫిడల్‌ కాస్ట్రో గురించి ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ”అమెరికా కుట్రలను జయించి, చావుదెబ్బ కొట్టి గెలిచిన కమ్యూనిస్టు సమున్నత శిఖరం ఆయన. ప్రపంచంలో చిన్న దేశం నుండి అత్యంత శక్తివంతమైన అమెరికాకే చుక్కలు చూపించిన వీరుడాయన”. ఇంగ్లండ్‌ రచయిత్రి వర్జీనియా వోల్ఫ్‌ గురించి ”ఆమె అనుసరించిన విశ్వమానవ విధానమే, ఆమె ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు సాధించడానికి కారణం” అన్నారు. ”అతని విషాదమరణం ముగింపు కాదు. ఒక ప్రేమ కథకు కొత్త ప్రారంభం. విక్టర్‌ జారా చనిపోయాడు. కానీ, అతని ప్రేమ, అతని స్వరం శాశ్వతంగా పాడుతూనే ఉంది. అతని స్ఫూర్తితో ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రేమ పుడుతూనే ఉంది”. ఇవీ ‘ఆఖరి పేజీ’ పుస్తకానికి, విక్టర్‌ జారా జీవితానికి రాసిన ఆఖరి మాటలు.
– ఎస్‌.వీరయ్య, 94900 98026

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -