Tuesday, June 24, 2025
E-PAPER
Homeఆటలుఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా పెంచుతాం

ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా పెంచుతాం

- Advertisement -

– దేశానికే ఆదర్శంగా తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీ
– ఒలింపిక్‌ డే రన్‌లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్‌

దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ క్రీడా విధానాన్ని సిద్ధం చేశామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాను సైతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జూన్‌ 23న అంతర్జాతీయ ఒలింపిక్‌ డే రన్‌ సందర్భంగా సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకలకు క్రీడాశాఖ మంత్రి శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ కే. శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, క్రీడాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, శాట్జ్‌ ఎండీ సోనిబాల దేవి తదితరులు హాజరయ్యారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యత
‘సీఎం రేవంత్‌ రెడ్డి క్రీడాభిమాని. రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలిపాలని ఆయన ఆలోచన. అందుకే దేశానికి ఆదర్శంగా నిలిచేలా నూతన స్పోర్ట్స్‌ పాలసీని రూపొందించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాను 2 శాతం నుంచి పెంచుతున్నాం. క్షేత్ర స్థాయి నుంచి క్రీడాభివృద్ది జరిగేలా సమగ్ర క్రీడా విధానం రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది, యువత అంకుఠిత దీక్షతో పని చేసి అత్యుత్తమ ప్రదర్శన చేయటంపై దృష్టి నిలపాలని’ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
అథ్లెట్లకు మేలు చేకూరేలా..
‘క్రీడాకారులకు మేలు జరిగిలే నూతన క్రీడా విధానం రూపకల్పన చేశాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకాలు అందుకునేందుకు ఎటువంటి సిఫారసుల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. కొత్త స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ప్రతిభావంతులైన ప్రతి క్రీడాకారుడికి ఆటోమెటిక్‌గా ప్రభుత్వ ఉద్యోగం, నగదు బహుమతి అందుతుంది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాలు, అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని శాట్జ్‌ చైర్మెన్‌ కే.శివసేనా రెడ్డి తెలిపారు.
ఉత్సాహంగా ఒలింపిక్‌ డే రన్‌
అంతర్జాతీయ ఒలింపిక్‌ డే రన్‌ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. హైదరాబాద్‌ నలుమూలల నుంచి 14 కేంద్రాల్లో మొదలైన ఒలింపిక్‌ డే రన్‌.. ఆద్యంతం ఒలింపిక్‌ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఎల్బీ స్టేడియానికి చేరుకున్నాయి. వర్థమాన క్రీడాకారుల్లో స్ఫూర్తి రగిల్చేందుకు తెలంగాణ ప్రఖ్యాత అథ్లెట్లు నిఖత్‌ జరీన్‌, మహ్మద్‌ సిరాజ్‌, నందిని అగసార, దీప్తి జీవాంజి సహా 14 మంది పేర్ల మీదుగా ఒలింపిక్‌ జ్యోతి ర్యాలీ సాగింది. తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (టీఓఏ), తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) సమన్వయంతో ఒలింపిక్‌ డే రన్‌ను ఘనంగా నిర్వహించారు.
జాతీయ విజేతలకు ప్రైజ్‌మనీ
ఈ ఏడాది ఆరంభంలో ఉత్తరాఖాండ్‌ వేదికగా జరిగిన 38వ జాతీయ క్రీడల్లో 3 స్వర్ణాలు, , 3 రజతాలు, 12 కాంస్య పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ఎట్టకేలకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒలింపిక్‌ డే రన్‌ వేడుకల సందర్భంగా రూ.84 లక్షల చెక్‌ను ప్రదానం చేశారు. నేషనల్‌ గేమ్స్‌ విజేతల తరఫున ఆసియా గేమ్స్‌ పతక విజేత నందిని అగసారకు మంత్రి వాకిటి శ్రీహరి నగదు బహుమతి చెక్‌ అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -