న్యూఢిల్లీ : ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిధిని భారీగా పెంచుతూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.1లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. దీంతో అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసుకునే ఖాతాదారులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఆటోసెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పెండ్లి, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు చేయడం కోసం రూ.5 లక్షల వరకు ఆన్లైన్లో ఆటోమెటిక్గా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో క్లెయిమ్ సెటిల్మెంట్ సమయమూ 3-4 రోజులకు తగ్గనుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాలెన్స్ నుంచి వేగంగా, ముందస్తుగా అధిక మొత్తం నగదును ఉపసంహరించుకోవడానికి వీలు కలుగనుంది.