– ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
చిన్న వయసులో ప్రేమంటూ చదువును ఆగం చేసుకోవద్దని కన్నతల్లి కూతురికి నచ్చజెప్పింది.. మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పింది.. కానీ, ఆ బాలికకు తల్లి మాటలు కంటగింపుగా అనిపించాయి. దీంతో కక్ష పెంచుకుని ప్రియుడు, అతని తమ్ముడితో కలిసి తల్లిని దారుణంగా చంపేశారు. మృతురాలు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఫోక్ సింగర్ అని తెలిసింది. ఈ దారుణ ఘటనపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలోని ఇనుగుర్తి గ్రామానికి చెందిన అంజలి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీడిమెట్లలో నివాసం ఉంటోంది. పెద్ద కుమార్తె(16) పదో తరగతి చదువుతోంది. బాలికకు నల్లగొండ జిల్లాకు చెందిన పగిల్ల శివతో 8 నెలల కిందట ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. విషయం అంజలికి తెలియడంతో చదువుకోవాల్సిన వయసులో ప్రేమ ఏంటని ఇద్దరినీ మందలించింది. ఈ క్రమంలో ఈనెల 19న ఇంట్లో నుంచి బాలిక ప్రియుడితో వెళ్లిపోయింది. దాంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం శివ బాలికను పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో తమ ప్రేమకు అడ్డంగా ఉన్న తల్లిని ఎలాగైనా అంతమొందించాలని కూతురు, ఆమె ప్రియుడు కలిసి పథకం వేశారు. ఈ నెల 23న(సోమవారం సాయంత్రం) బాలిక ప్రియుడు అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి ఆమె ఇంటికి వచ్చారు.
అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి శివ ఆమె మెడకు చున్ని బిగించడంతో తీవ్ర పెనుగులాట జరిగింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని శివ, అతని తమ్ముడు వెళ్లిపోయారు. అదే సమయంలో అంజలి చిన్న కుమార్తె ట్యూషన్ నుంచి ఇంటికొచ్చింది. అమ్మ పూజ చేస్తూ కింద పడిపోయిందని, తాను చూసుకుంటానని ఆ బాలికకు మాయమాటలు చెప్పి పెద్ద కుమార్తె బయటకు పంపించింది. ఆ తర్వాత మళ్లీ శివను పిలిపించి అంజలి తలపై సుత్తితో కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మను చంపేసింది అక్కే.. : చెల్లి
”మా అక్కే మా అమ్మను చంపింది” అని అంజలి చిన్న కూతురు మీడియా ఎదుట చెప్పింది. ‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క ఆపింది.. అమ్మ ఒక ఆంటీని తీసుకురమ్మంది.. పదా వెళ్దాం అంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా.. అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అని అక్క చెప్పింది. చుట్టుపక్కల ఎవరికీ చెప్పొద్దని చెప్పింది. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. తర్వాత అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకొని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి కత్తితో అమ్మ తలపై కొట్టాడు” అని చిన్న కుమార్తె తెలిపింది.
చదువు ఆగం చేసుకోవద్దని చెప్పినందుకు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES