కేసీఆర్, జగన్ హయాంలోనే నిర్ణయం
సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు
నవతెలంగాణ-షాబాద్
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు నష్టమేమీ లేదని, దీన్ని కావాలనే బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం పాటుపడే సీఎం నారా చంద్రబాబు నాయుడుపై బురద చల్లే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలవకుండా బనకచర్ల ప్రాజెక్టు కట్టి రాయలసీమకు నీరందించేందుకు చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఈ నిర్ణయం కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారని, అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు సమస్యను సామరస్యంగా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు పరిష్కరించుకోవాలని సూచించారు. కానీ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంతో పబ్బం గడుపుకోవడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషించి, ఆ నీటితో రాయలసీమకు నీరందించి రతనాల సీమగా మార్చుతానన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జలవనరుల సమస్యలు ఉంటే కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి కానీ, మరొకరిపై నిందలు వేయడం బీఆర్ఎస్ నాయకులకు సబబు కాదన్నారు. సీఎం చంద్రబాబుకి తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే ఉద్దేశం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ కలిసి బనకచర్లపై హైదరాబాద్లో గానీ, ఢిల్లీ వేదికగా అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చిద్దామని తెలిపారు. లావణి పట్టా భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ సంపన్నులకు కొమ్ము కాస్తూ రక్షిత కౌలుదారు చట్టం ద్వారా వచ్చిన కాస్తు కాలంను కూడా ధరణిలో లేకుండా చేశారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు 15ఏండ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి రేవంత్ గురువును తరిమేశామనడం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దాదె పోచయ్య, లక్ష్మీనారాయణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టమేమీ లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES