– ఉద్యమాలకు సీపీఐ(ఎం) మద్ధతు : జాన్వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ఉద్యమానికి మద్ధతునివ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీని కలిశారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేస్తున్న ఉద్యమానికి మద్ధతునిస్తున్నట్టు తెలిపారు. చిత్తశుద్ధితో బీసీల కోసం ఎవరు పోరాటాలు చేసినా పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. జులై 17న రైల్ రోకోకు మద్ధతుకు సంబంధించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రానికి వినతిపత్రాలు సమర్పించడానికే పరిమితం కావొద్దనీ, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపైనే ఉందని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో న్యాయముందని తెలిపారు. బీజేపీ ఎప్పటికీ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, అడ్డంకిగా ఉందని విమర్శించారు. అయితే కులగణన వ్యతిరేకించిన బీజేపీ ప్రజా ఉద్యమాలకు తలొగ్గి ముందుకురాక తప్పలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకులపై ఉందని గుర్తుచేశారు.
హైదరాబాద్ అడిక్మెట్లోని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సాధినేని వెంకటేశ్వర రావు, జేవీ చలపతి రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్తోను ఎమ్మెల్సీ కవిత కలిసి మద్ధతు కోరారు. అనంతరం కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. వామపక్ష పార్టీలు తమ ఉద్యమానికి మద్ధతు ప్రకటించాయని ఆమె తెలిపారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లినా సీఎం ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రవాణాను స్తంభింపజేసేలా రైల్రోకో ఉంటుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ఏ మాత్రం ప్రయత్నించడం లేదని విమర్శించారు. కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదముద్ర వేయాలంటే ఉద్యమబాట ఒక్కటే మార్గమని చెప్పారు. కవిత వెంట యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో ఆర్డినేటర్ ఆలకుంట హరి తదితర నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES