– త్వరలో కళాశాలల్లోనూ పీటీఎం : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సర్కారు కట్టుబడి ఉందని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యా నాణ్యతను మెరుగుపర్చేందుకు మేధోమథనం జరిపేందుకు జిల్లా ఇంటర్ అధికారులు, ప్రిన్సిపాళ్లఓ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశాన్ని గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విద్యే సమాజ రూపాంతరం, విద్యార్థుల భవిష్యత్కుఉ ఆధారమని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థికి అవసరమైన నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మద్దతు లభించేలా ప్రిన్సిపాళ్లు, డీఐఈవోలు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సుమారు 75 వేల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారని వివరించారు. కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి యూడైస్ డేటాలో కచ్చితంగా నమోదు చేయాలని కోరారు. విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించడం, వారు తప్పనిసరిగా ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. అకడమిక్ కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వం పెంపొందించేలా ఉండాలని కోరారు. ఇందుకోసం డీఐఈవోలు, ప్రిన్సిపాళ్లతో వివిధ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. త్వరలో ప్రతి కాలేజీలోనూ తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం (పీటీఎం) నిర్వహించాలని సూచించారు. ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమి వంటి ఆన్లైన్ వేదికల ద్వారా జేఈఈ, నీట్, క్లాట్, ఎప్సెట్ ఉచిత ఆన్లైన్ శిక్షణను అందిస్తున్నామని వివరించారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు రవాణా, హాస్టల్ సదుపాయాలు టీజీఎస్ఆర్టీసీ, సంక్షేమ శాఖలతో సమన్వయం చేసి కల్పిస్తామని అన్నారు. కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా అకడమిక్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని కోరారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వారిని ప్రోత్సహించాలని చెప్పారు. సంక్షేమ శాఖల ద్వారా స్కాలర్షిప్ కోసం నమోదు సమయానికి పూర్తి చేయాలని వివరించారు. హెల్ప్, హార్ట్ ఫుల్నెస్, ప్రజ్వలా సంస్థల ద్వారా ధ్యానం, మంచి జీవనశైలి, లైంగిక దాడుల నివారణ, జాగ్రత్తలు, మాదక ద్రవ్యాలను నిరోధించడం, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్లు, బాధ్యతాయుత జీవన శైలి కోసం అవగాహన పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య, సీవోఈ జయప్రదబాయి, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాణ్యమైన విద్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES