– ప్రభుత్వ ఆర్డర్లతో చేతినిండా పని ఉన్నా.. మిగిలేది సున్నా..
– సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పెట్టుబడిదారులదే పైచేయి
– శ్రమ ఆసాములది, లాభం సేట్లకు
– మీటరుకు రూ.6 కూలితో ఖర్చులు పోనూ మిగిలేది అప్పులే!
– కార్మికుల కొరతతో గడువులోపు ఉత్పత్తి పూర్తి చేయలేని దుస్థితి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పథకంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొన్ని కోట్ల మీటర్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. రెండేండ్లుగా పని కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు ఉపాధి భరోసా లభించింది. ఈ ప్రభుత్వ ఆర్డర్లు దక్కించుకున్న బడా యజమానుల ఖజానాలు నిండుతున్నాయి కానీ, ఈ మూడంచెల వ్యవస్థలో కీలకమైన ‘ఆసామి’ (మరమగ్గాల నిర్వాహకుడు) మాత్రం అంతులేని నష్టాల్లో కూరుకుపోతున్నాడు. అయితే, ముడి సరుకు ప్రభుత్వమే అందజేస్తే ఆసామికి కొంత గిట్టుబాటుగా ఉండేది. కానీ పెట్టుబడి భారం, పెరిగిన నిర్వహణ ఖర్చులు, గిట్టుబాటు కాని కూలితో ఆసామి బతుకు అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. పరిశ్రమ బండిని లాగుతున్నా, ఫలాలు మాత్రం ఇతరులకే దక్కుతుండటంతో సిరిసిల్ల ఆసామి గాథ అరణ్యరోదనగా మారుతోంది.
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అంటేనే కార్మికులు, ఆసాములు, యజమానులతో కూడిన సంక్లిష్టమైన మూడంచెల వ్యవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఏడాదిన్నరకుపైగా ఆర్డర్లు లేక వెలవెలబోయిన పరిశ్రమకు.. ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పథకం కింద 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ జీవం పోసింది. దీనికి తోడు గత ప్రభుత్వ బకాయిలు రూ.280 కోట్లు విడుదల చేయడం, పాఠశాల యూనిఫాం ఆర్డర్లు ఇవ్వడం, యారన్ డిపో ఏర్పాటు వంటి చర్యలు పరిశ్రమకు ఊతమిచ్చాయి. ఆగస్టు 15 నాటికి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఆసామికి మిగిలేది సున్నే..
ఈ మొత్తం ప్రక్రియలో తీవ్రంగా నష్టపోతున్నది ఆసాములే. ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లను దక్కించుకునేది రూ.కోట్లలో పెట్టుబడి పెట్టగల స్థోమత ఉన్న కొద్దిమంది యజమానులే. ముడిసరుకుపై పెట్టుబడి పెడుతున్న వీరు ప్రభుత్వం నుంచి మీటరుకు వచ్చే రూ.34లో సుమారు రూ.8లాభంగా తీసుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆసాములు, కార్మికులకు కూలిగానూ, ఇతర ఖర్చుల కింద పంచుతున్నారు. ఆసామికి దక్కే మీటరు కూలి రూ.11 మాత్రమే. ఇందులో రూ.5 కార్మికునికి చెల్లిస్తే, ఆసామికి మిగిలేది రూ.6 మాత్రమే. ఈ ఆరు రూపాయలతోనే అతను అన్ని ఖర్చులూ భరించాలి. మరమగ్గాన్ని (సాంచె) కొత్త ఆర్డర్కు సిద్ధం చేయడానికి ఆసామికి సుమారు రూ.10వేల వరకు ఖర్చు అవుతోంది. అందులో వైపర్ కార్మికునికి ఒక్కో బీము నింపేందుకు రూ.1,200, నక్ష జాలెలకు రూ.800, కొత్త డిజైన్ జాలెలకు రూ.3,800, రీడ్ మార్పు (64 నుంచి 84కు మార్చేందుకు) రూ.వెయ్యి, డిజైన్ వేసే వ్యక్తికి రూ.2,500.. వీటికి అదనంగా కండెలు, కరెంటు బిల్లు, జాపర్ల వంటి ఖర్చులు ఉంటాయి. ప్రతి 50 మీటర్ల బట్ట ఉత్పత్తి తర్వాత బీము మార్చినప్పుడల్లా వైపర్ కార్మికునికి రూ.1200 చెల్లించాల్సిందే. ఇంత ఖర్చు భరించి, మీటరుకు రూ.6 సంపాదిస్తే, నష్టాలు తప్ప లాభాలు ఎలా వస్తాయని ఆసాములు ప్రశ్నిస్తున్నారు. శ్రమ తాము చేస్తుంటే, ఏ పనీ చేయని యజమానులు రూ.కోట్లు గడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికుల కొరతతో అదనపు భారం
ఆర్డర్లు లేని సమయంలో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవడంతో ఇప్పుడు పరిశ్రమ తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. కొత్త తరం ఈ వృత్తిలోకి రాకపోవడం, ఉన్న కార్మికుల్లో చాలామంది 50 ఏండ్లు పైబడిన వారు కావడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. వయసు పైబడటంతో దారం పోగులు సరిగా కనిపించక, పని వేగంగా సాగక కొందరు మానేస్తున్నారు. దీంతో ఆసాములు కార్మికులను బతిమిలాడి పనికి పిలుచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఆర్డర్లు పూర్తి చేయలేక నష్టపోతున్నారు. లక్ష్యాలు పూర్తి చేయని సొసైటీల ఆర్డర్లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడం వారిని మరింత ఆందోళనలోకి నెడుతోంది. మొత్తంగా ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, పరిశ్రమలోని అంతర్గత దోపిడీ వ్యవస్థను ప్రక్షాళన చేయనంత కాలం ఆసాముల బతుకులు మారవన్నది అక్షర సత్యమనే చెప్పాలి. కార్మికులతోపాటు పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న ఆసాములను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యజమానుల గుప్పెట్లో పరిశ్రమ
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కేవలం పది మంది బడా యజమానుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. వీరే ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నేతలుగా, స్థానిక సంస్థల ప్రతినిధులుగా చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వం ఆర్డర్లను మ్యాక్స్ సొసైటీలు, చిన్న తరహా పరిశ్రమలకు కేటాయి స్తున్నా, రూ.కోట్లలో పెట్టుబడి పెట్టే శక్తి లేని ఆసాములు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యజమానులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ఫలాలు, రాయితీలు నేరుగా ఆసాములకు చేరకుండా యజమానుల జేబుల్లోకి వెళ్తున్నాయి.
అన్నీ భారమే..
మీటరుకు ఆరు రూపాయలు లాభం అంటూ యజమాని చేతిలో పెడతాడు. ఇందులో కరెం ట్ బిల్లు, మిషన్ మరమ్మతులు, కార్మికుడికి ముందస్తు కూలి అన్నీ భారమే. నెలాఖరుకు నేను సంపాదించేది ఏమి లేదు. అప్పు మాత్రం పెరుగు తోంది. – ఆడెపు మోహన్, ఆసామి, సిరిసిల్ల
ముడి సరుకు ప్రభుత్వమే ఇవ్వాలి
సొసైటీ పేరు మీద ఆర్డర్ వచ్చినా మేము ఉత్పత్తి చేయాలంటే ముడిసరుకు కోసం బడా యజమాని దగ్గరికే వెళ్లాలి. సాంచెల మరమ్మతు, జాలెలు, బీము పెట్టే కార్మికులు, సహా ఇతర ఖర్చులు పెరిగిపోయాయి. చేతితో బట్ట నేస్తున్నాంగానీ లాభాలు మాత్రం పెద్దవాళ్ల జేబుల్లోకి పోతున్నాయి. దీన్ని ఎలా న్యాయంగా చెప్తారు? మాకు ప్రభుత్వమే ముడిసరుకు ఇవ్వాలి. – రవీందర్, ఆసాముల సంఘం సమన్వయ కమిటీ అధ్యక్షులు