డోనాల్డ్ ట్రంప్కు తత్వం బోధపడ్డట్టుంది. ప్రపంచ దేశాలతో రాజీకి వస్తున్నాడా!! మూడునెల్లపాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటన దేనికి సూచిక ? ప్రపంచ మార్కెట్ల మీద చైనా ఎలాంటి గౌరవం ప్రదర్శించని కారణంగా 125శాతం విధిస్తున్నట్లు, దానిపై ఎలాంటి సంప్రదింపులు ఉండవని ట్రంప్ చెప్పటం మేకపోతు గాంభీర్యం తప్ప మరొకటి కాదు. యావత్ ప్రపంచం మీద పన్నుపోరు ప్రకటించిన అతగాడి నిర్వాకం కారణంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయన్నది తెలిసిందే. మూడు నెలల వాయిదా ప్రకటనతో ప్రపంచవ్యాపితంగా స్టాక్మార్కెట్లు కోలుకున్నాయి. చిత్రం ఏమిటంటే చైనా మీద విధించిన 125 శాతంపై వెనక్కు తగ్గేది లేదన్న తర్వాత కూడా చైనా స్టాక్ మార్కెట్లు మిగతా వాటితో పాటు గురువారం నాడు పెరిగాయి. ఈ పూర్వరంగంలో చైనా మీద ప్రతి సుంకాలు ఎందుకు ప్రభావం చూపలేదు ? పర్యవసానా లేమిటి? అసలు ట్రంప్ ఎందుకు వెనక్కు తగ్గాడనే చర్చ, విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
మూడు నెలల వాయిదాకు దోహదం చేసిన అంశాలేమిటి? తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్ చెప్పుకున్నాడు. అలాంటి వారి మీద సభ్య సమాజం ఉచ్చరించటానికి సిగ్గుపడే పదజాలంతో వ్యాఖ్యానించాడు.వారంతా ఒప్పందం చేసుకోవటానికి చచ్చిపోతున్నా రన్నాడు.రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ‘మనకు ఫోన్లు చేస్తున్న దేశాల వారు ప్లీజ్ ప్లీజ్ సర్ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను’ అని చెబుతున్నారని, చివరకు తనను ముద్దు పెట్టుకుంటానన్నారని నోరుపారేసుకున్నాడు. ఇది నిజమా? అబద్దాలు, గొప్పలు చెప్పటంలో ఆరితేరిన ట్రంప్ గురించి తెలిసినప్పటికీ తెరవెనుక సిగ్గు ఎగ్గూలేని అలాంటి బాపతు ఉన్నా ఆశ్చర్యం లేదు. చైనా సరేసరి తగ్గేదేలే అని చెప్పింది. మిత్రపక్షంగా ఉన్న ఐరోపా సమాఖ్య 2300కోట్ల ్ డాలర్ల మేరకు అమెరికా వస్తువుల మీద పన్ను విధించనున్నట్లు ప్రకటించింది, కెనడా కూడా అదే బాటలో ఉంది.మన దేశం మౌనభాషనే కొనసాగి స్తోంది. అటూ ఇటూ ఏదీ చెప్పకుండా గోడమీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నాం. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి సరుకులను మనదేశానికి దిగుమతి చేసుకొని వాటిని తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు. పిటిఐ వార్త మేరకు చైనా, ఇతర ఆసియన్ దేశాల సరుకులను మన దేశం నుంచి ఎగుమతి చేయవద్దని చెప్పారట. అలా జరుగుతోందని గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు అలా మాట్లాడారంటే ఎవరి మెప్పు పొందేందుకో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ మరో సందేహం కూడా తలెత్తుతోంది. గతంలో అలా చేసిఉంటే అసలు నిజంగా మన ఎగుమతులు పెంచామని బీజేపీ పాల కులు కొట్టుకుంటున్న డబ్బా మీదనే అనుమానం వస్తోంది. మనది ‘దలాల్’ ప్రభుత్వమా?
అసలు పన్నుల వాయిదా నిర్ణయానికి దారితీసిందేమిటి? మొదటి కారణంగా చెప్పుకోవాలంటే అమెరికాలో ఏప్రిల్ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20లక్షల మంది జనం1400 ప్రదేశాల్లో నిరసనలు, ప్రదర్శనలు చేశారు. వెనక్కు తగ్గకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చుకుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలంగా మాట్లాడిన ఉదంతం లేదు. ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్ మస్క్ సంపద ఇప్పటి వరకు 13,500కోట్ల డాలర్లు హరించుకుపోయింది. చైనాతో సహా ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్ను మస్క్ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్ నవారో, మరో కీలక సలహాదారు ఎలన్మస్క్ రోడ్డెక్కి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ పరిణామాలతో గోడమీద పిల్లులు కూడా వ్యతిరేక శిబిరంలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపుకు పెద్ద స్పందన కనిపించటం లేదు. మూడు నెలల కాలంలో లొంగుబాటును ప్రదర్శించే దేశాల మీద కొన్ని ఒప్పందాలను రుద్ది లబ్ది పొందే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉండవచ్చు. ఈ వ్యవహారం కూడా త్వరంలోనే బట్టబయలు కానుంది. ఒకడుగు వెనక్కు వేసిన ట్రంప్ను దారికి తేవాలంటే అమెరికన్లు మరింతగా వీధుల్లోకి రావాలి, బాధిత దేశాలన్నీ సమైక్యం కావాల్సిన అవసరం ఉంది. భారీ విజయం పొందిన యాభై రోజుల్లో ”పిచ్చివాడు” అని పిలిపించుకున్న చరిత్ర, అంత వ్యతిరేకత మూటగట్టుకున్నవాడు ట్రంపే!
ఒక్క అడుగు వెనక్కు?
- Advertisement -
RELATED ARTICLES